దావూద్ ఇబ్రహీంకు సంబంధించిన ఓ మనీలాండరింగ్ కేసులో మహారాష్ట్ర మంత్రి, ఎన్సీపీ నేత నవాబ్ మాలిక్ అరెస్ట్ అయిన విషయం తెలిసిందే. ఆయన్ను రాజీనామా చేయిస్తారా? ఏం చేస్తారన్నది ఆసక్తిగా మారింది. అయితే ఈ విషయంపై ఎన్సీపీ అధినేత శరద్ పవార్ ఓ నిర్ణయానికి వచ్చారు. ఆయన నిర్వహించే శాఖలను ఇతరులకు బదిలీ చేయాలని ప్రభుత్వానికి సిఫార్సు చేశారు.
ప్రస్తుతం స్కిల్ డెవలప్మెంట్, మైనారిటీ వ్యవహారాలను నవాబ్ మాలిక్ చూస్తున్నారు. మనీలాండరింగ్ కేసులో అరెస్టైన నేపథ్యంలో ఆయన శాఖలను మరొకరికి బదిలీ చేయాలని పవార్ ప్రభుత్వానికి సిఫార్సు చేయనున్నారు. అయితే ఈ శాఖలను మంత్రి, ఎన్సీపీ నేత రాజేశ్ తోపే లేదా జితేంద్ర ఆహ్వాద్కు ఇవ్వనున్నారు.
ఎన్సీపీ అధినేత శరద్ పవార్ అధ్యక్షతన ఓ కీలక సమావేశం జరిగింది. ఈ సమావేశానికి డిప్యూటీ సీఎం, ఎన్సీపీ నేత అజిత్ పవార్తో పాటు మరికొంత మంది నేతలు హాజరయ్యారు. ఈ సమావేశం ముగిసిన తర్వాత ఎన్సీపీ నేత జయంత్ పాటిల్ మాట్లాడారు. నవాబ్ మాలిక్ బెయిల్ పిటిషన్ మరోసారి తోసిపుచ్చారు. దీంతో.. ఆయన నిర్వహిస్తున్న శాఖలను మరో మూడు రోజుల్లో ఇతర మంత్రులకు బదలాయిస్తారు. నవాబ్ మాలిక్ బయటకు వచ్చేంత వరకూ ఇలా బదలాయింపు చేయాలని మేం విన్నవించాం అని ఎన్సీపీ నేత జయంత్ పాటిల్ వెల్లడించారు.