ఐదేళ్ల నుంచి పదిహేను ఏళ్ల పిల్లలకు కోవిడ్ టీకా ఇచ్చే విషయంలో నిపుణులు ఇంకా ఎలాంటి సిఫార్సూ చేయలేదని కేంద్ర కుటుంబ, ఆరోగ్య మంత్రి మన్సుఖ్ మాండవీయ అన్నారు. నిపుణుల సిఫార్సులు రావడమే ఆలస్యం.. ఐదేళ్ల నుంచి పదిహేను ఏళ్ల వయస్సున్న పిల్లలకు కూడా వ్యాక్సినేషన్ ప్రారంభిస్తామని మాండవీయ ప్రకటించారు. గుజరాత్ గాంధీనగర్లో మంత్రి మన్సుఖ్ మాండవీయ విలేకరులతో మాట్లాడారు. ఏఏ వయస్సుల్లో ఉన్న వారికి కోవిడ్ టీకా ఇవ్వాలన్నది నిపుణుల సలహాలు, సిఫార్సుల పైనే ఆధారపడి ఉంటుందని స్పష్టం చేశారు.
ఇక 15 నుంచి 18 సంవత్సరాలున్న యువకులకు కోవిడ్ వ్యాక్సినేషన్ ప్రారంభించామని, 5 ఏళ్ల నుంచి 15 సంవత్సరాల వయస్సున్న వారి విషయంలో నిపుణుల సిఫార్సులు రాగానే టీకాను వేయడం ప్రారంభిస్తామని అన్నారు. అయితే కొన్ని నెలల క్రితం చేసిన ఓ సర్వేలో దాదాపు 67 శాతం మంది పిల్లల్లో వ్యాధినిరోధక శక్తి పెరిగిందని, వ్యాధి లక్షణాలు కూడా లేవని తేలిందని మంత్రి మాండవీయ తెలిపారు.