న్యూఢిల్లీ : భారత్ గౌరవ్ స్కీం కింద గత నెలలో దేశంలో తొలి ప్రైవేట్ రైలుకు రైల్వేలు పచ్చజెండా ఊపిన నేపధ్యంలో ప్యాసింజర్ ట్రైన్లనూ ప్రైవేట్ ఆపరేటర్లకు అప్పగించే యోచనపై ప్రభుత్వం వివరణ ఇచ్చింది. ప్రయాణీకుల రైళ్లను ప్రైవేట్ ఆపరేటర్లతో నిర్వహించే ప్రతిపాదన లేదని పార్లమెంట్లో ప్రభుత్వం స్పష్టం చేసింది.
రైల్వేలు ఈ దిశగా ఎలాంటి ప్రతిపాదనను పరిశీలించడం లేదని రైల్వే మంత్రి అశ్వనీ వైష్ణవ్ రాజ్యసభలో ఇచ్చిన లిఖితపూర్వక సమాధానంలో పేర్కొన్నారు. నిర్ధిష్ట రూట్లను ప్రైవేట్ ఆపరేటర్లకు అప్పగించే ప్రతిపాదనపై రైల్వేలు తమ ఆలోచనలను పలుమార్లు వెల్లడించిన నేపధ్యంలో రైల్వే మంత్రి ఈ వివరణ ఇచ్చారు. ఢిల్లీ-లక్నో, అహ్మదాబాద్-ముంబై రూట్లలో ఐఆర్సీటీసీ రెండు తేజాస్ కార్పొరేట్ ట్రైన్లను నడుపుతుండగా రెండు రైళ్లపై రూ 58 కోట్ల నష్టం వాటిల్లిందని మంత్రి తెలిపారు.
2019-20లో లక్నో-ఢిల్లీ తేజాస్ రూ 2.3 కోట్ల లాభం ఆర్జించినా మరుసటి రెండేండ్లలో నష్టాలు వచ్చాయని చెప్పారు. దశల వారీగా తన నెట్వర్క్లో ప్రైవేట్ ట్రైన్లను ప్రవేశపెట్టాలని రైల్వేలు యోచిస్తుండగా కేవలం ఐఆర్సీటీసీ, మేఘా ఇంజనీరింగ్ వంటి రెండు సంస్ధల నుంచే బిడ్లు రావడంతో మొత్తం ప్రక్రియ నెమ్మదించింది.