శ్రీనగర్: జమ్ముకశ్మీర్లో చలి చంపేస్తున్నది. కనిష్ఠ ఉష్ణోగ్రతలు అత్యంత దారుణంగా పడిపోయాయి. చాలా ప్రాంతాల్లో మైనస్ డిగ్రీల్లో ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. పహల్గామ్, గుల్మార్గ్ తదితర ప్రాంతాల్లో కనిష్ఠ ఉష్ణోగ్రతలు మరింత దారుణంగా పడిపోయాయి. బారాముల్లా జిల్లాలోని ప్రముఖ స్కీయింగ్ రిసార్ట్ అయిన గుల్మార్గ్లో మైనస్ 9.5 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.
ఇక అమరనాథ్ యాత్ర బేస్ క్యాంప్ అయిన అనంతనాగ్ జిల్లాలోని పహల్గామ్లో రికార్డు స్థాయిలో మైనస్ 11.4 డిగ్రీ సెల్సియస్ ఉష్ణోగ్రతలు రికార్డయ్యాయి. గత రాత్రి నమోదైన మైనస్ 10.3 డిగ్రీ సెల్సియస్ కంటే ఇది చాలా తక్కువ. ఖాజీగండ్లో 7.6 డిగ్రీ సెల్సియస్, కొకెర్నాగ్లో మైనస్ 7.2 డిగ్రీ సెల్సియస్ కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదైనట్లు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.
కాగా, విపరీతమైన చలి కారణంగా కశ్మీర్ ప్రజలు గజగజ వణుకుతున్నారు. అత్యవసర పనులుంటే తప్ప రాత్రి వేళల్లో ఇండ్ల నుంచి అడుగు బయటపెట్టడంలేదు. ఉదయాల్లో కూడా చాలా పొద్దుపోయే మంచు వర్షం కురుస్తున్నది. దాంతో రహదారులపైన, ఇండ్లపైన భారీగా భారీగా మంచు పేరుకుపోతున్నది. మరో నెలన్నర వరకు కశ్మీర్లో చలి తీవ్రత ఇలాగే ఉంటుందని అధికారులు చెప్పారు.