న్యూఢిల్లీ: యూపీఎస్సీ పరీక్షలో ఉత్తీర్ణత సాధించిన భారత వాయుసేన (ఐఏఎఫ్) సిబ్బందిని సివిల్ సర్వీసెస్లో చేరేందుకు అనుమతించాలని మిలిటరీ కోర్టు ఆదేశించింది. దీని కోసం సంబంధిత నియమాలను సవరించాలని ఐఏఎఫ్కు సూచించింది. ఇండియన్ ఎయిర్ఫోర్స్కు చెందిన కార్పోరల్ ఆయుష్ మౌర్య, 2021 యూపీఎస్సీ పరీక్షను క్లియర్ చేశారు. అలాగే సార్జెంట్ కుల్దీప్ విభూతి, బీహార్ ప్రభుత్వ రాష్ట్ర స్థాయి పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించారు. ఈ నేపథ్యంలో ఐఏఎఫ్ను వీడి సివిల్ సర్వీసెస్లో చేరేందుకు ఎన్వోసీ కోసం దరఖాస్తు చేశారు.
కాగా, ఏ క్యాటగిరి స్కిల్ గ్రేడ్ ఉండి సంబంధిత పరీక్షలు రాసేందుకు ముందస్తుగా ఆన్లైన్లో అనుమతి కోరితేనే భారత వాయు సేనను వీడేందుకు నిబంధనల ప్రకారం అనుమతిస్తారు. ఈ నేపథ్యంలో వారిద్దరి ఎన్వోసీ దరఖాస్తులను ఐఏఎఫ్ తిరస్కరించింది. దీంతో వారు సాయుధ దళాల ట్రిబ్యునల్ను ఆశ్రయించారు. జస్టిస్ రాజేంద్ర మీనన్ నేతృత్వంలోని ఆర్మ్డ్ ఫోర్సెస్ ట్రిబ్యునల్ ప్రిన్సిపల్ బెంచ్ ఈ పిటిషన్లపై విచారణ జరిపింది.
న్యాయవాది అంకుర్ చిబ్బర్ వారిద్దరి తరుఫున వాదించారు. సివిల్ సర్వీసెస్ పరీక్షల కోసం తన క్లైంట్లు ఆన్లైన్ ద్వారా ముందస్తు అనుమతికి ప్రయత్నించినట్లు తెలిపారు. అయితే కేవలం ఏ క్యాటగిరి స్కిల్ గ్రేడ్ ఉన్నవారికి మాత్రమే ఆ అనుమతి ఉందని చెప్పారు. అయితే ఏ క్యాటగిరి స్కిల్ గ్రేడ్ ఉన్నవారు మాత్రమే సివిల్ సెక్టార్లో ఉద్యోగాలకు ప్రయత్నించవచ్చన్న నిబంధన సరి కాదని ఢిల్లీ హైకోర్టు పేర్కొన్న సంగతిని ఆయన గుర్తు చేశారు.
దీంతో ఇరువైపు వాదనలు విన్న మిలిటరీ కోర్టు కార్పోరల్ ఆయుష్ మౌర్య, సార్జెంట్ కుల్దీప్కు అనుకూలంగా తీర్పు ఇచ్చింది. సివిల్ సర్వీసెస్లో చేరడం కోసం వారిద్దరికీ ఎన్వోసీతోపాటు డిశ్చార్జ్ ఆర్డర్ను రెండు వారాల్లో ఇవ్వాలని ఐఏఎఫ్ను ఆదేశించింది. అలాగే స్కిల్ గ్రేడ్ ఏ లేని వారు కూడా సివిల్ సర్వీసెస్ వంటి పరీక్షలు రాయడం కోసం ముందస్తు అనుమతికి సంబంధించిన ఆన్లైన్ ప్రక్రియను సవరించాలని సూచించింది.