విశాఖ: మిలన్ ఇంటర్నేషనల్ సిటీ పరేడ్ ప్రారంభమైంది. సముద్రంలో యుద్ధనౌకలు, ఆకాశంలో యుద్ధ విమానాల విన్యాసాలతో విశాఖ ఆర్కే బీచ్ ప్రాంగణం మార్మోగిపోతున్నది. వివిధ దేశాల నౌకాదళాలు చేస్తున్న విన్యాసాలు, పరేడ్ విశాఖ వాసులను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. మిరుమిట్లు గొలిపే టపాసులు, రంగురంగుల విద్యుత్ దీపాలతో ఆర్కే బీచ్ పండగ వాతావరణం నెలకొన్నది.
గంటన్నర పాటు జరిగే సముద్ర యుద్ధ విన్యాసాలు, గగనతల వాయుసేన విన్యాసాలను సీఎం జగన్ తిలకిస్తున్నారు. తూర్పు నౌకాదళం వేదికగా ఈ మిలాన్ విన్యాసాలు మార్చి 4 వరకు జరగనున్నాయి. 39 దేశాలకు చెందిన 13 నౌకలు, జలాంతర్గాములు, యుద్ధవిమానాలు మిలాన్ విన్యాసాల్లో పాల్గొన్నాయి. ఈ పరేడ్లో భారతీయ నౌకాదళం వివిధ ఆయుధాలతో నిర్వహించే మల్టీ డైమెన్షనల్ విన్యాసాలు ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నాయి.
ఇంటర్నేషనల్ సిటీ పరేడ్ సందర్భంగా వివిధ నౌకాదళాలు ఆర్కే బీచ్ రోడ్డులో చేపట్టిన కవాతు ఆకర్శణగా నిలిచింది. వివిధ సైనిక స్కూళ్ల విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలు విశేషంగా ఆకట్టుకున్నాయి. శత్రుసేనలను మట్టుపెట్టే దృశ్యాలు ఆశ్చర్యపరిచాయి. అంతకుముందు ఐఎన్ఎస్ విశాఖను ఏపీ సీఎం జగన్ జాతికి అంకితం చేశారు. తర్వాత ఐఎన్ఎస్ వేలాను సందర్శించారు. జగన్ వెంట ఆయన సతీమణి భారతి కూడా ఉన్నారు.