400 ఘోర ప్రమాదాలు.. 250 మందికి పైగా మృతులు. భారత వాయుసేనకు చెందిన మిగ్-21 యుద్ధ విమానం గురించి స్థూలంగా చెప్పాలంటే ఈ గణాంకాలు చాలు. అందుకే ఈ విమానాన్ని ఫ్లయింగ్ కఫిన్ (ఎగిరే శవపేటిక), విడో మేకర్ (వితంతువులను తయారు చేసే విహంగం) అని వ్యంగ్యంగా పిలుస్తారు. ఈ జెట్లో ప్రయాణిస్తే మళ్లీ తిరిగి రాలేరన్న విమర్శలూ ఉన్నాయి. ఇన్ని అపవాదులు మూటగట్టుకున్నప్పటికీ, వాయుసేన ఇంకా మిగ్-21 యుద్ధ విమానాలను ఎందుకు కొనసాగిస్తున్నది? తరుచూ ఇవి కూలిపోవడానికి గల కారణాలేంటి?
– నేషనల్ డెస్క్
రాజస్థాన్లోని బార్మర్ జిల్లాలోని బిమ్రా సమీపంలో గురువారం మరో మిగ్-21 విమానం కుప్పకూలింది. ఈ ఘటనలో ఇద్దరు ఫైలట్లు మృతిచెందారు. దీంతో మిగ్-21 విమానాల భద్రతా ప్రమాణాలపై మరోసారి ఆందోళనలు వ్యక్తం అవుతున్నాయి. భారత వాయుసేనలో ఎక్కువ కాలం కొనసాగుతున్న యుద్ధ విమానంగా మిగ్-21 రికార్డులకెక్కింది. తరుచూ ఈ విమానాలు ప్రమాదానికి గురవుతుండటంతో కాలం చెల్లిన ఈ జెట్లను విరమించుకోవాలన్న డిమాండ్లు పెరిగిపోతున్నాయి.
1962లో చైనాతో యుద్ధం తర్వాత వాయుసేనను మరింత బలోపేతం చేయాలని భారత ప్రభుత్వం నిర్ణయానికి వచ్చింది. ఈ క్రమంలో అప్పటి సోవియెట్ యూనియన్కు చెందిన మికోయన్-గురేవిచ్ డిజైన్ బ్యూరో (ఓకేబీ) ఏరోస్పేస్ కంపెనీ నుంచి మిగ్-21 విమానాల కొనుగోలుకు ఒప్పందం చేసుకున్నది. 1963లో మిగ్-21 యుద్ధ విమానం భారత వైమానిక దళంలోకి చేరింది. అప్పటికి మొదటి సూపర్సోనిక్ ఫైటర్ జెట్ ఇదే. అనంతరం మిగ్-21 విమాన తయారీ, అసెంబుల్ సాంకేతికతను రష్యా భారత్కు అందజేసింది. 1967లో ఈ విమానాల తయారీకి హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ లైసెన్స్ పొందిం ది. అనంతరం విమానాల ఉత్పత్తిని ప్రారంభించింది.
1963 నుంచి ఇప్పటివరకూ 400కు పైగా మిగ్-21 విమానాలు కుప్పకూలాయి. ఈ ప్రమాదాల్లో 200 మంది ఫైలట్లు, మరో 50 మంది సాధారణ పౌరులు మృత్యువాత పడ్డారు. అందుకే ఈ విమానాలను ఫ్లయింగ్ కఫిన్, విడో మేకర్గా పిలుస్తున్నారు. అయినప్పటికీ, భారత వాయుసేన మొత్తంగా 1,200 మిగ్-21 విమానాలను, వాటి వెర్షన్లను ఇప్పటివరకూ వాయుసేనలోకి తీసుకొచ్చింది. ప్రస్తుతం వైమానిక దళంలో దాదాపు 120 మిగ్-21 విమానాలు (ట్రైనింగ్, మరమ్మతులతో కలిపి) ఉన్నాయి. అయితే, విమర్శలు కొనసాగుతున్నప్పటికీ, వాయుసేన మిగ్-21 శ్రేణిని కొనసాగించడానికి పలు కారణాలు ఉన్నాయని రక్షణ రంగ నిపుణులు చెబుతున్నారు. ‘పక్కలో బల్లెంలా మారిన చైనా, పాకిస్థాన్ను ఎదుర్కోవడానికి వాయుసేనకు అత్యంత శక్తిమంతమైన మల్టీపర్పస్ ఫైటర్ జెట్లు పెద్ద సంఖ్యలో కావాలి. ఇప్పటికిప్పుడు యుద్ధం వస్తే భారత గగనతలాన్ని కాపాడుకోవడానికి 126 రాఫెల్ స్థాయి మల్టీపర్పస్ ఫైటర్ జెట్లు అవసరం. ప్రస్తుతం 36 రాఫెల్స్ ఉన్నా యి. మిగ్-21కు అప్గ్రేడెడ్ వెర్షన్లు సుఖోయ్ 30, లైట్ కంబాట్ ఎయిర్క్రాఫ్ట్స్ (ఎల్సీఏ) అందుబాటులోకి వచ్చినా, ఎక్కువ సంఖ్యలో లేవు. ఎల్సీఏ తేజస్ విమానాలు పూర్తిస్థాయిలో ఇంకా అందుబాటులోకి రాలేదు. అందుకే అమ్ములపొదిలో ఉన్న మిగ్ విమానాలతోనే వాయుసేన.. సరిహద్దుల్లో గస్తీ నిర్వహిస్తున్నద’ని రిటైర్డ్ ఎయిర్ వైస్ మార్షల్ సునీల్ నానోడ్కర్ అన్నారు. ఇండియా స్పెండ్ నివేదిక ప్రకారం.. మిగ్-21 జీవితకాలం 1990లోనే ముగిసిపోయింది. సామర్థ్యానికి మించి వినియోగించడం వల్లే మిగ్-21 విమానాలు కుప్పకూలుతున్నట్టు నిపుణులు చెబుతున్నారు.
2మిగ్-21 విమానాలపై విమర్శలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో వాయుసేన కీలక నిర్ణయం తీసుకున్నది. ఈ సెప్టెంబర్ చివరి నాటికి శ్రీనగర్లోని 51 ఎయిర్ బేస్ స్కాడ్రన్ మిగ్-21 విమానాల సేవలను నిలిపివేయనున్నట్టు వాయుసేన వర్గాలు తెలిపాయి. మిగిలిన మిగ్ 21 బైసన్లోని మూడు స్కాడ్రన్లను ఏడాదికి ఒకటి చొప్పున .. 2025 నాటి పూర్తిగా నిలిపివేయనున్నట్టు వెల్లడించాయి. ప్రస్తుతం ఒక్కో స్కాడ్రన్లో 16-18 మిగ్ విమానాలు ఉన్నాయి.
మిగ్ విమానాల తయారీని నిలిపివేస్తున్నట్టు 1985లో సోవియెట్ యూనియన్ ప్రకటించింది. అధునాతన యుద్ధ విమానాలను ఉత్పత్తి చేయడంలో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నట్టు వెల్లడించింది. అనంతరం బంగ్లాదేశ్, ఆఫ్గనిస్థాన్ కూడా తమ వాయుసేనల నుంచి మిగ్ సేవలను
ఉపసంహరించాయి. అయితే, భద్రతా పరమైన సమస్యలు తలెత్తడంతోనే ఆ దేశాలు మిగ్-21 విమానాలను పక్కనబెట్టినట్టు నివేదికలు వెల్లడించాయి. అయితే, భారత వాయుసేన మాత్రం అప్గ్రెడేషన్ చేస్తూ మిగ్ విమానాలను ఇంకా కొనసాగిస్తూనే ఉన్నది