ముంబై: అర్ధరాత్రి వేళ నిమ్మకాయ కోసం మహిళ తలుపు తట్టడం ఆ అధికారికి తగని పని అని బాంబే హైకోర్టు పేర్కొంది. అతడి ప్రవర్తన నేపథ్యంలో అధికారులు విధించిన జరిమానా రద్దు చేసేందుకు నిరాకరించింది. (Woman’s Door Knock At Mid night) సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (సీఐఎస్ఎఫ్)లో కానిస్టేబుల్గా పని చేసిన 33 ఏళ్ల అరవింద్ కుమార్ 2021 ఏప్రిల్ 19న మద్యం సేవించాడు. సహోద్యోగి ఎలక్షన్ డ్యూటీ నిమిత్తం బెంగాల్ ఉండటంతో అతడి భార్య ఇంట్లో ఒంటరిగా ఉన్నట్లు తెలుసుకున్నాడు. అర్ధ రాత్రి వేళ ఆమె ఇంటి తలుపుతట్టాడు.
కాగా, ఆరేళ్ల కుమార్తెతో కలిసి ఉన్న మహిళ తన భర్త ఇంట్లో లేడని అరవింద్కు చెప్పింది. తమను ఇబ్బంది పెట్టవద్దని కోరింది. అరిచి అందిరినీ పిలుస్తానని హెచ్చరించడంతో చివరకు అతడు అక్కడి నుంచి వెళ్లిపోయాడు. అనంతరం ఆ మహిళ ఫిర్యాదుపై సీఐఎస్ఎఫ్ ఉన్నతాధికారులు స్పందించారు. అరవింద్ కుమార్ దుష్ప్రవర్తనపై చర్యలు చేపట్టారు. మూడేళ్లపాటు జీతం తగ్గించారు. అలాగే శిక్షగా ఆ కాలం వరకు ఎలాంటి ఇంక్రిమెంట్ కూడా ఇవ్వలేదు.
మరోవైపు అరవింద్ కుమార్ దీనిపై బాంబే హైకోర్టును ఆశ్రయించాడు. తాను అస్వస్థతకు గురి కావడంతో నిమ్మకాయ కోసం మాత్రమే పొరుగింటి మహిళ తలుపు తట్టినట్లు పిటిషన్లో పేర్కొన్నాడు. న్యాయమూర్తులు నితిన్ జామ్దార్, ఎంఎం సతయేలతో కూడిన డివిజన్ బెంచ్ ఈ పిటిషన్పై విచారణ జరిపింది. అర్ధరాత్రి వేళ నిమ్మకాయ కోసం భర్త ఇంట్లో లేని మహిళ తలుపు తట్టడం సీఐఎస్ఎఫ్లో పని చేసే అధికారికి తగనిదని కోర్టు పేర్కొంది. పిటిషనర్ ఉద్దేశం ఖచ్చితంగా నిమ్మకాయ కోసం కాదని కోర్టు అభిప్రాయపడింది. అతడి దుష్ప్రవర్తనకు విధించిన జరిమానా రద్దు చేసేందుకు నిరాకరించింది. మార్చి 11న ఈ మేరకు తీర్పు ఇచ్చింది.