న్యూఢిల్లీ, సెప్టెంబర్ 29: పాఠశాల విద్యార్థులకు పోషకాలతో కూడిన వేడివేడి ఆహారాన్ని అందిస్తున్న ‘మధ్యాహ్న భోజనం’ పథకం పేరును ‘పీఎం పోషణ్ శక్తి నిర్మాణ్ (పీఎం పోషన్)’గా మారుస్తూ కేంద్రప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. బుధవారం ప్రధాని మోదీ అధ్యక్షతన సమావేశమైన కేంద్ర మంత్రివర్గం ఈ మేరకు ఆమోదం తెలిపింది.
వచ్చే ఏడాది ఐపీవోకి ‘ఈసీజీసీ’
వచ్చే ఐదేండ్లకుగానూ ప్రభుత్వరంగ బీమా సంస్థ ఎక్స్పోర్ట్ క్రెడిట్ గ్యారెంటీ కార్పొరేషన్ (ఈసీజీసీ)లో రూ. 4,400 కోట్ల పెట్టుబడులు, ఎన్ఈఐఏలో రూ.1,650 కోట్లు పెట్టేందుకు కేంద్ర క్యాబినెట్ ఆమోదముద్ర వేసింది. ఈసీజీసీని వచ్చే ఏడాది ఐపీవో ద్వారా లిస్టింగ్లోనికి చేర్చేందుకు గ్రీన్సిగ్నల్ ఇచ్చింది.
యూపీ బడిలో దళిత పిల్లలకు ప్రత్యేక లైను
అమేఠీ, సెప్టెంబర్ 29: మధ్యాహ్న భోజనం వడ్డించే సమయంలో దళిత పిల్లలను వేరే లైన్లో నిలబెట్టడంపై యూపీలోని అమేఠీలో కేసు నమోదైంది. గడేరీ గ్రామంలోని ప్రాథమిక పాఠశాల ప్రిన్సిపాల్ కుసుమ్ సోనిపై పోలీసులు ఎస్సీ/ఎస్టీలపై అకృత్యాల నిరోధక చట్టం కింద కేసు నమోదు చేశారు. ప్రిన్సిపాల్ను సస్పెండ్ చేశారు.
13వేల కోట్లతో రక్షణ సామగ్రి కొనుగోలు
న్యూఢిల్లీ: స్వదేశీ సాంకేతికతతో తయారు చేసిన 25 ఏఎల్హెచ్ మార్క్-3 హెలికాప్టర్లు సహా రూ.13,165 కోట్ల విలువైన రక్షణ ఉత్పత్తుల కొనుగోలు ప్రతిపాదనకు రక్షణ శాఖ ఆమోదం తెలిపింది. వీటిలో 87% స్వదేశీ సామగ్రినే కొనుగోలు చేయనున్నారు. ఏఎల్హెచ్ హెలికాప్టర్లను హాల్ నుంచి కొనుగోలు చేయనున్నారు. డీఆర్డీవో నుంచి 118 యుద్ధ ట్యాంకులు, స్పెయిన్ నుంచి 56 సీ-295 రవాణా విమానాల కొనుగోలుకు ఒప్పందం జరిగిన వారంలోనే మరో కొనుగోలు ప్రతిపాదనకు ఆమోదం లభించింది.