న్యూఢిల్లీ: విమానం గాలిలో ఉండగా అందులో ప్రయాణించిన పసికందు ఊపిరి పీల్చుకోవడంలో ఇబ్బంది పడింది. తల్లి రోధన చూసి చలించిన ఇద్దరు డాక్టర్లు ఆ చిన్నారి ప్రాణాలు కాపాడారు (Baby Saved By Doctors Mid-Air). ఇండిగో విమానంలో ఈ సంఘటన జరిగింది. శనివారం ఉదయం రాంచీ నుంచి ఢిల్లీకి ఆ విమానం బయలుదేరింది. 20 నిమిషాల ప్రయాణం తర్వాత విమానం గాలిలో ఉండగా పుట్టుకతో గుండె సమస్య ఉన్న పసిబిడ్డ ఆరోగ్య పరిస్థితి విషమించింది. ఊపిరి తీసుకోలేక ఇబ్బంది పడింది. తల్లి ఆందోళన చెందటంతో విమానంలో ఎవరైనా డాక్టర్లు ఉంటే సహాయం చేయాలని సిబ్బంది ఎనౌన్స్మెంట్ ఇచ్చారు.
కాగా, జార్ఖండ్ గవర్నర్ ప్రిన్సిపల్ సెక్రటరీ డాక్టర్ కులకర్ణి, రాంచీలోని సదర్ ఆసుపత్రికి చెందిన డాక్టర్ మొజమిల్ ఫెరోజ్ ఆ చిన్నారిని రక్షించేందుకు ముందుకు వచ్చారు. పిల్లల మాస్క్ లేకపోవడంతో పెద్దల మాస్క్ ద్వారా ఆక్సిజన్ అందించారు. పేరెంట్స్ వద్ద ఉన్న ఇంజెక్షన్ ఇచ్చారు. పుట్టుక నుంచి గుండె సమస్య ఉన్న ఆ పసికందును ఢిల్లీలోని ఎయిమ్స్ హాస్పిటల్కు తీసుకెళ్తున్నట్లు తెలుసుకున్నారు.
మరోవైపు విమానం ల్యాండింగ్ తర్వాత తక్షణ వైద్య సహాయ ఏర్పాట్లు చేయాలని సిబ్బందిని ఆ ఇద్దరు డాక్టర్లు కోరారు. దీంతో ఢిల్లీ విమానాశ్రయంలో ఆ విమానం ల్యాండ్ కాగానే పూర్తి మెడికల్ సపోర్ట్ ఉన్న అంబులెన్స్ ద్వారా ఆ పసిబిడ్డను ఆసుపత్రికి తరలించారు. సుమారు గంటకుపైగా తాము అందించిన వైద్య సహాయం పట్ల సంతృప్తిగా ఉందని డాక్టర్ కులకర్ణి హర్షం వ్యక్తం చేశారు. పసికందు ప్రాణాలు కాపాడిన ఆ ఇద్దరు డాక్టర్ల సేవలను మిగతా ప్రయాణికులు కూడా ప్రశంసించారు.