బెంగళూరు, జనవరి 19: రెండు ఇండిగో విమానాలకు తృటిలో పెను ప్రమాదం తప్పింది. ఈ ఘటన బెంగళూరులో ఈ నెల 9న చోటుచేసుకోగా.. ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. అసలేం జరిగిందంటే.. బెంగళూరులోని కెంపెగౌడ అంతర్జాతీయ విమానాశ్రయంలో రెండు రన్వేలు ఉన్నాయి. రెండు రన్వేలపై రెండు ఇండిగో విమానాలు ఉన్నాయి. ఒకటి కోల్కతాకు, మరొకటి భువనేశ్వర్కు వెళ్లాల్సి ఉన్నది. అయితే సమన్వయ లోపంతో ఈ రెండు విమానాలు ఒకదానికి ఒకటి తెలియకుండా టేకాఫ్ అయ్యేందుకు సిద్ధమయ్యాయి. ఈ రెండు విమానాలకు ఒకే సమయంలో టేకాఫ్ అయ్యేందుకు ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్ అనుమతి వచ్చింది. కానీ రెండు విమానాలు ఒకేసారి టేకాఫ్ అయ్యే పరిస్థితి లేదు. అదే దిశలో వెళ్తున్న విమానం మరొకదానితో ఢీకొనే పరిస్థితి ఏర్పడింది. దీన్ని చూసిన రాడార్ కంట్రోలర్ వెంటనే జోక్యం చేసుకొని అప్రమత్తం చేయటంతో పెను ప్రమాదం తప్పింది. ఘటనపై డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్(డీజీసీఏ) ఆగ్రహం వ్యక్తం చేసింది. దీనిపై విచారణకు ఆదేశించి, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకొంటామని పేర్కొన్నది.