పనాజీ : గోవాలో త్వరలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటవుతుందని ఆ పార్టీ శాసనసభా పక్ష నేతగా ఎన్నికైన మైఖేల్ లోబో ఆశాభావం వ్యక్తం చేశారు. పది నుంచి 15 నెలల్లో రాష్ట్రంలో ప్రభుత్వం మారుతుందని ఆయన అంచనా వేశారు. గోవా రాజకీయాల్లో ఏదీ అసాధ్యం కాదని, క్షేత్రస్ధాయి పరిస్ధితి ఆధారంగా అనూహ్య మార్పులు ఏర్పడే అవకాశం ఉంటుందని లోబో పేర్కొన్నారు.
రాబోయే కొద్ది నెలల్లో తమ ప్రభుత్వం ఏర్పాటవుతుందని, ఈ దిశగా తాము ముమ్మర ప్రయత్నాలు చేపడతామని చెప్పారు. బీజేపీకి 25 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉండగా కాంగ్రెస్ ప్రభుత్వ ఏర్పాటును ఎలా సాధ్యం చేస్తారని ప్రశ్నించగా ప్రస్తుతం విపక్షంలో తమకు 15 మంది ఎమ్మెల్యేలు ఉన్నారని వచ్చే ఏడాది తమ పార్టీకి కీలకమని ప్రభుత్వ ఏర్పాటు దిశగా ప్రయత్నాలు ఊపందుకుంటాయని చెప్పారు. ముగ్గురు ఇండిపెండెంట్లు, ఇద్దరు ఎంజీపీ ఎమ్మెల్యేలున్నారని ఈ క్రమంలో ఏమైనా జరగొచ్చని లోబో వ్యాఖ్యానించారు.
ప్రజలు సైతం తమ సిద్ధాంత విభేదాలను పక్కనపెట్టారని, 67.33 శాతం మంది ప్రజలు ప్రస్తుత ప్రభుత్వాన్ని కోరుకోలేదని గుర్తుచేశారు. బీజేపీకి కేవలం 32 శాతం ఓట్లే దక్కాయని 67 శాతం ఓట్లు పలు పార్టీల మధ్య చీలిపోయాయని చెప్పుకొచ్చారు. పార్టీలకు అతీతంగా ఈ 67 వాతం మంది ప్రజల గళాన్ని ప్రభుత్వం వినిపించుకోవాలని స్పష్టం చేశారు.