న్యూఢిల్లీ : ఉత్తర 24 పరగణాల జిల్లాలో ఈ నెల 5న ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ED) బృందంపై జరిగిన దాడికి సంబంధించి తమకు పూర్తిస్థాయి నివేదిక సమర్పించాలని పశ్చిమబెంగాల్ ప్రభుత్వాన్ని కేంద్ర హోంశాఖ కోరింది. దర్యాప్తు సంస్థలపై దాడుల నిరోధానికి ఎలాంటి చర్యలు తీసుకున్నారో నివేదికలో తెలుపాలని ఆదేశించింది. ఈ విషయాన్ని కేంద్ర హోంశాఖ వర్గాలు వెల్లడించాయి.
ఈ నెల 5న ఉత్తర 24 పరగణాల జిల్లాలోని సందేశ్ఖాలిలో టీఎంసీ నేత షాజహాన్ షేక్ ఇంట్లో సోదాల కోసం వెళ్లిన ఈడీ బృందంపై ఆయన అనుచరులు దాడికి పాల్పడ్డారు. ఆ దాడిలో ముగ్గురు ఈడీ అధికారులు గాయపడ్డారు. వారి మొబైల్ ఫోన్లు, ల్యాప్టాప్లు, వాలెట్లు దోపిడీకి గురయ్యాయి. ఈ క్రమంలో షాజహాన్ పరారయ్యారు. ఆయన కోసం ఈడీ లుక్అవుట్ నోటీసు జారీ చేసింది. దేశం నుంచి జారుకోకుండా చూడాలని సంబంధిత వర్గాలకు సూచించింది.
కాగా, ఈ నెల 5ననే మరో ఈడీ బృందంపై కూడా దాడి జరిగింది. బాంగావ్లో టీఎంసీ నేత శంకర్ ఆధ్యా అరెస్టు సందర్భంగా ఈడీ టీమ్పై దాడి జరిగింది. వారి వాహనాలు ధ్వంసమయ్యాయి. ఈ నేపథ్యంలో దర్యాప్తు సంస్థల బృందాలపై దాడుల నిరోధానికి తీసుకున్న చర్యలపై నివేదిక పంపాలని కేంద్రం కోరింది. ఈడీపై దాడి నేపథ్యంలో ఆ సంస్థ ఇంఛార్జి డైరెక్టర్ రాహుల్ నవీన్ సోమవారం అర్ధరాత్రి కోల్కతా చేరుకున్నారు. గవర్నర్ సీవీ ఆనంద్ బోస్తో ఆయన సమావేశం కానున్నారు.