న్యూఢిల్లీ, మార్చి 21: ఇటీవల కేంద్రం ప్రవేశపెట్టిన పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ) కింద దరఖాస్తు చేసుకోవాలనుకునే వారికి సహాయపడటానికి కేంద్ర హోం మంత్రిత్వ శాఖ గురువారం ఒక హెల్ప్ లైన్ను ప్రారంభించింది. దరఖాస్తు చేసుకునే వారికి కావాల్సిన సమాచారాన్ని అందించడానికి, సహాయపడటానికి, వారికి వచ్చే సందేహాలను తీర్చడానికి గురువారం నుంచి 1032 నంబర్తో పనిచేసే హెల్ప్లైన్ను ప్రారంభించింది.
భారత దేశంలోని ఏ ప్రాంతం నుంచైనా ఈ హెల్ప్లైన్ నంబర్కు ఉదయం 8 నుంచి రాత్రి 8 గంటల వరకు పౌరులు ఫోన్ చేయవచ్చు. ఇప్పటికే ప్రభుత్వం సీఏఏకు సంబంధించి మొబైల్ అప్లికేషన్ను ప్రారంభించింది. పాకిస్థాన్, బంగ్లాదేశ్, అఫ్గానిస్థాన్ నుంచి 2014, డిసెంబర్ 31కు ముందు భారత్కు శరణార్థులుగా వచ్చి ఉంటున్న హిందువులు, సిక్కులు, జైనులు, బౌద్ధులు, పార్సీలు, క్రైస్తవులకు పౌరసత్వాన్ని కల్పించేందుకు కేంద్రం సీఏఏను తీసుకొచ్చింది.