మెట్రోమ్యాన్, బీజేపీ నేత శ్రీధరన్ గురువారం సంచలన నిర్ణయం తీసుకున్నారు. తాను రాజకీయాల నుంచి వైదొలుగుతున్నానని సంచలన ప్రకటన చేశారు. తనకు తత్వం బోధపడిందని, ఎన్నికల బరిలోకి దిగి… గుణపాఠం నేర్చుకున్నానని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మలప్పురం వేదికగా శ్రీధరన్ ఈ వ్యాఖ్యలు చేశారు. తాను నేతాగిరీ ఎన్నడూ చేయలేదని, రాజకీయ నేతగా ఎన్నడూ లేనని పేర్కొన్నారు. ”ప్రస్తుతం నాకు 90 ఏళ్లు. ఇంకా రాజకీయాల్లో ఉండడం, రాజకీయాలను కెరీర్గా కొనసాగిస్తే చాలా ప్రమాదం. రాజకీయాలను చేయడం నా కల కూడా కాదు” అని శ్రీధరన్ స్పష్టం చేశారు.
బీజేపీలో చేరడంతో హైలెట్ అయిన మెట్రోమ్యాన్
మెట్రో మ్యాన్ గా ఉంటూ అందరికీ చిర పరిచితులైన శ్రీధరన్ కేరళ ఎన్నికల సమయంలో బీజేపీలో చేరుతున్నట్లు ప్రకటించారు. దీంతో ఒక్కసారిగా అందరి దృష్టీ ఆయనపైనే పడింది. ప్రజల నుంచి స్పందన కూడా అద్భుతంగా వచ్చింది. అంతేకాకుండా పాలక్కడ్ నుంచి బీజేపీ అభ్యర్థిగా రంగంలోకి కూడా దిగారు. పాలక్కడ్లోనే ఇల్లు అద్దెకు తీసుకుంటానని, నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పిస్తానని, లవ్ జిహాద్ను అడ్డుకుంటానని కూడా శ్రీధరన్ హామీ ఇచ్చారు. సీఎం పదవి కూడా చేపట్టేందుకు రెడీ అని ప్రకటించారు. అయితే ప్రత్యర్థులకు గట్టి పోటీనే ఇచ్చిన శ్రీధరన్…. ఓటమి పాలయ్యారు. తన ప్రత్యర్థి, కాంగ్రెస్ అభ్యర్థి షఫీ పరంబిల్ విజయం సాధించారు. పాలక్కడ్ ఓటమి తర్వాత శ్రీధరన్ సైలెంట్ అయిపోయారు. చాలా రోజుల తర్వాత…. రాజకీయాలకు గుడ్బై చెబుతున్నట్లు ప్రకటించారు.