న్యూఢిల్లీ: రైలులో ప్రయాణించిన ఇద్దరు వ్యక్తులు కంపార్ట్మెంట్లో స్మోక్ చేశారు. దీంతో ఒక ప్రయాణికుడు ఫిర్యాదు చేయగా రైల్వే శాఖ స్పందించింది. ఆ ఇద్దరు ప్రయాణికులను రైల్వే పోలీసులు హెచ్చరించారు. రైల్వే చట్టంలోని సెక్షన్ 167 ప్రకారం రైళ్లలో పొగతాగడం నేరం. అయితే భుజ్ నుంచి బరేలీకి ప్రయాణించే ట్రైన్ నంబర్ 14322 బరేలీ ఎక్స్ప్రెస్లో ఇద్దరు వ్యక్తులు అందరి ముందు స్మోక్ చేశారు. రిజర్వేషన్ కోచ్లో ఉన్న వారిద్దరూ సిగరెట్లు కాల్చడంపై తోటి ప్రయాణికులు అభ్యంతరం వ్యక్తం చేశారు. అయినప్పటికీ వారు లెక్కచేయలేదు. నిలదీసిన ప్రయాణికుల పట్ల దురుసుగా ప్రవర్తించారు. ఈ నేపథ్యంలో ఒక ప్రయాణికుడు తన మొబైల్ ఫోన్లో వారి చర్యను వీడియో రికార్డ్ చేశాడు. రైలులో వారు స్మోక్ చేయడంపై ట్విట్టర్లో రైల్వేకు ఫిర్యాదు చేశాడు.
కాగా, రైల్వే సేవా సిబ్బంది దీనిపై స్పందించారు. ఫిర్యాదు చేసిన ప్రయాణికుడి వివరాలు తెలుసుకున్నారు. ఆ రైలు తర్వాత స్టేషన్లో రైలు ఆగినప్పడు రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ (ఆర్పీఎఫ్) సిబ్బంది ఆ కంపార్ట్మెంట్ వద్దకు వచ్చారు. రైలులో సిగరెట్లు కాల్చిన ఇద్దరు ప్రయాణికులను హెచ్చరించారు. ఫిర్యాదు చేసిన వ్యక్తికి దీని గురించి రైల్వే శాఖ సమాచారం ఇచ్చింది.
మరోవైపు ఈ వీడియో క్లిప్తోపాటు రైల్వే చర్యల ట్వీట్లు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. దీంతో కదులుతున్న రైలులో సిగరెట్లు తాగిన ఆ ఇద్దరు ప్రయాణికుల తీరుపై నెటిజన్లు మండిపడ్డారు. వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
@IRCTCofficial @RailMinIndia Passengers Lighting Cigarettes in front of Kids & Senior Citizen and abusing when all are stopping them., Train No 14322 Coach S-5 Seat Number’s 39-40.
Please take action as soon as possible pic.twitter.com/kxQJUDc72T— Manish Jain (@jainmanish0906) February 5, 2023
A RPF personal has came to Bandikui Station and warned the Passengers for not smoking the cigarettes in train
— Manish Jain (@jainmanish0906) February 5, 2023