పెళ్లిళ్లు స్వర్గంలో నిశ్చయం అవుతాయంటారు. కానీ కొందరికి పెళ్లి వల్ల కష్టాలే మిగుల్తాయి. మనశ్శాంతి కరువు అవుతుంది. ఇలా కేవలం ఆడవాళ్లకే కాదు. కొంతమంది భర్తలకు కూడా ఇలాంటి అనుభవాలు ఎదురవుతాయి. అదిగో అలాంటి వారి కోసమే కొందరు భర్తలు కలిసి ‘‘పత్ని పీడిత్’’ అనే ఆశ్రమం పెట్టుకున్నారు. తాజాగా వీళ్లంతా కలిసి ఒక పెద్ద రావి చెట్టు వద్ద నిరసన చేశారు. తమ కష్టాలు కూడా వినాలని, తమ వంటి వారి కోసం చట్టాలు తీసుకురావాలని డిమాండ్ చేశారు.
ఈ ఘటన మహారాష్ట్రలోని పూణేలో జరిగింది. సాధారణంగా ‘వట పూర్ణిమ’ సందర్భంగా తమకు అదే భర్త మరో ఏడు జన్మలపాటు దక్కాలంటూ భార్యలు పూజలు చేస్తారు. అనంతరం మర్రిచెట్టుకు మొక్కి, దాని చుట్టూ 108 ప్రదక్షిణలు చేస్తారు. ఇదే మాదిరిగా ‘పత్ని పీడితుల’ ఆశ్రమ వాసులు కూడా ప్రదక్షిణలు చేశారు.
కాకపోతే భార్యలు మర్రిచెట్టుకు మొక్కుతారు కాబట్టి.. తాము రావి చెట్టుకు మొక్కుతున్నామని ఆశ్రమ వ్యవస్థాపకుడు భరత్ ఫులారే తెలిపారు. అనంతరం రావి చెట్టు చుట్టూ అపసవ్య దిశలో 108 ప్రదక్షిణలు చేశారా ఆశ్రమ సభ్యులంతా కలిసి. భార్యా పీడితులకు కూడా న్యాయం కావాలంటూ డిమాండ్ చేశారు.