చండీగఢ్: ఇజ్రాయెల్లో ఉద్యోగాల కోసం (jobs in Israel) రిక్రూట్మెంట్ డ్రైవ్ నిర్వహిస్తున్నారు. పలు రాష్ట్రాలకు చెందిన యువకులు పెద్ద సంఖ్యలో పోటెత్తారు. దేశంలో నిరుద్యోగ సమస్యపై వారు ఆందోళన వ్యక్తం చేశారు. బీజేపీ పాలిత హర్యాలో ఈ సంఘటన జరిగింది. పాలస్తీనాకు చెందిన గాజాలోని హమాస్తో యుద్ధం నేపథ్యంలో ఇజ్రాయెల్లో కార్మికుల కొరత ఏర్పడింది. ఈ నేపథ్యంలో భారతీయులను కార్మికులుగా నియమించుకునేందుకు కేంద్ర ప్రభుత్వం, ఇజ్రాయెల్ మధ్య ఒప్పందం జరిగింది.
కాగా, ఇజ్రాయెల్కు చెందిన అధికారులు హర్యానాలోని రోహ్తక్లో రిక్రూట్మెంట్ డ్రైవ్ నిర్వహిస్తున్నారు. నిర్మాణం, పెయింటింగ్, వ్యవసాయం తదితర రంగాల్లో ఉద్యోగాల కోసం ఆరో రోజుల పాటు రిక్రూట్మెంట్ ప్రక్రియ కొనసాగనున్నది. సుమారు పది వేల నుంచి 30 వేల మంది కార్మికుల నియామకం జరుగనున్నట్లు తెలుస్తున్నది. ఇజ్రాయెల్లో పని కోసం ఎంపికైన వారికి నెలకు రూ.1,34,000 వరకు చెల్లించనున్నారు.
మరోవైపు హర్యానాతోపాటు పంజాబ్, ఉత్తరప్రదేశ్, రాజస్థాన్ రాష్ట్రాలకు చెందిన యువకులు పెద్ద సంఖ్యలో ఈ రిక్రూట్మెంట్ డ్రైవ్కు తరలివచ్చారు. నైపుణ్య పరీక్షలకు హాజరైన యువకులు దేశంలో నిరుద్యోగ సమస్యపై ఆందోళన వ్యక్తం చేశారు. ఇజ్రాయెల్లో యుద్ధ పరిస్థితులు నెలకొన్నప్పటికీ తప్పనిసరి పరిస్థితుల్లో అక్కడ పనికి వెళ్లేందుకు సిద్ధమైనట్లు నిరుద్యోగ యువకులు వాపోయారు.