Deep Sleep | న్యూఢిల్లీ: ఎంత సేపు నిద్రపోయామన్నది కాదు.. నిద్ర ఎంత గాఢంగా ఉందన్నది ముఖ్యమని తాజా అధ్యయనం ఒకటి వెల్లడించింది. మధ్యవయస్సు(30 నుంచి 40 ఏండ్లు) వ్యక్తుల నిద్రలో పదే పదే అంతరాయాలు ఉంటే.. అలాంటి వారు పదేండ్లలో ఆలోచనా శక్తి, జ్ఞాపక శక్తి సమస్యలబారిన పడే అవకాశం ఎక్కువ.. అని సైంటిస్టులు తేల్చారు.
యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా, శాన్ఫ్రాన్సిస్కో సైంటిస్టుల అధ్యయనంపై ‘జర్నల్ న్యూరాలజీ’ నివేదిక విడుదల చేసింది. ‘అల్జీమర్స్ వ్యాధి లక్షణాలు బయటపడటానికి అనేక ఏండ్ల ముందే, మెదడులో వ్యాధి పేరుకుపోతున్నది. నిద్రకు.. జ్ఞాపకశక్తికి మధ్య ఉన్న సంబంధాన్ని తెలుసుకున్నాక, నిద్ర సమస్యలు.. వ్యాధులబారిన పడటాన్ని పెంచుతున్నదని అర్థమైంది’ అని పరిశోధకుడు యా లెంగ్ అన్నారు. మధ్య వయస్సులో గాఢ నిద్ర చాలా అవసరమని మా అధ్యయనం తేల్చిందని ఆయన చెప్పారు. సగటు వయస్సు 40 ఏండ్లు కలిగిన దాదాపు 526 మంది నిద్ర సమయాన్ని సైంటిస్టులు అధ్యయనం చేశారు.