న్యూఢిల్లీ: వజ్రాల వ్యాపారి మెహుల్ చోక్సీ అక్రమరీతిలో పంజాబ్ నేషనల్ బ్యాంక్ నుంచి సుమారు రూ.6344.96 కోట్లు దారిమళ్లించినట్లు సీబీఐ ఆరోపించింది. తన ఛార్జ్షీట్లో సీబీఐ ఈ విషయాన్ని పేర్కొన్నది. మోసపూరితమైన లేఖలను సమర్పించి క్రెడిట్ పొందినట్లు సీబీఐ తెలిపింది. మూడేళ్ల పాటు నిర్వహించిన విచారణ ఆధారంగా సీబీఐ తన ఛార్జ్షీట్లో ఈ విషయాలను ముంబై స్పెషల్ కోర్టుకు సమర్పించింది. పీఎన్బీ ఉద్యోగులను మభ్యపెట్టి.. చోక్సీతో పాటు ఆయన కంపెనీ ఎగ్జిక్యూటివ్లు స్కామ్కు పాల్పడినట్లు తేలింది. 165 లెటర్స్ ఆఫ్ అండర్స్టాండింగ్, 58 ఫారిన్ లెటర్స్ ఆఫ్ క్రెడిట్(ఎఫ్ఎల్సీ)ను ముంబైలోని బ్రాడీ హౌజ్ బ్రాంచీ 2017లో జారీ చేసినట్లు సీబీఐ పేర్కొన్నది. విదేశీ బ్యాంకులకు క్లయింట్ తరపున ఓ బ్యాంకు ఎల్ఓయూ లేఖను అందజేస్తుంది. ఒకవేళ కస్టమర్ ఆ డబ్బును విదేశీ బ్యాంక్కు చెల్లించకుంటే, అప్పుడు గ్యారెంటీ ఇచ్చిన బ్యాంక్ ఆ సొమ్ము చెల్లించాల్సి ఉంటుంది. అవగాహన లేఖల ఆధారం మారిషెస్లోని ఎస్బీఐ, హాంగ్ కాంగ్లోని అలహాబాద్ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్, ఆంట్వెర్ప్లోని బ్యాంక్ ఆఫ్ ఇండియా, మమానాలోని కెనరా బ్యాంక్, ఫ్రాంక్ఫర్ట్లోని ఎబ్సీఐ బ్యాంకులు చోక్సీ కంపెనీలకు రుణం ఇచ్చినట్లు తెలుస్తోంది. చోక్సీకి చెందిన కంపెనీలు రుణాలు చెల్లించకపోవడంతో.. అప్పు తీసుకున్న విదేశీ బ్యాంకులకు సుమారు 6344 కోట్లను పీఎన్బీ బ్యాంక్ మిత్తితో సహా చెల్లించింది. చోక్సీ సుమారు రూ.7080 కోట్లు ఎగవేసినట్లు పీఎన్బీ ఆరోపిస్తున్నది. అయితే విచారణ పూర్తి అయిన తర్వాత మొత్తం విలువ అంచనా వచ్చే అవకాశాలు ఉన్నట్లు సీబీఐ చెప్పింది.