న్యూఢిల్లీ: తనను కిడ్నాప్ చేసిన ఉగ్రవాదులను జమ్ముకశ్మీర్ మాజీ సీఎం, పీడీపీ అధినేత్రి మెహబూబా ముఫ్తీ సోదరి, రుబైయా సయీద్ శుక్రవారం గుర్తించింది. జేకేఎల్ఎఫ్ చీఫ్ యాసిన్ మాలిక్తో సహా మరో ముగ్గురు తనను కిడ్నాప్ చేసిన వారిలో ఉన్నారని సీబీఐ ప్రత్యేక కోర్టుకు ఆమె తెలిపింది. జమ్ముకశ్మీర్ మాజీ సీఎం ముఫ్తీ మహమ్మద్ సయీద్ చిన్న కుమార్తె అయిన రుబైయా సయీద్ను 1989 డిసెంబర్ 8న ఉగ్రవాదులు కిడ్నాప్ చేశారు. నాడు కేంద్రంలో అధికారంలో ఉన్న వీపీ సింగ్ ప్రభుత్వం జేకేఎల్ఎఫ్ డిమాండ్ మేరకు ఆ సంస్థకు చెందిన ఐదుగురు ఉగ్రవాదులను విడిచిపెట్టడంతో ఆమెను వదిలిపెట్టారు.
కాగా, 1990లో రుబైయా కిడ్నాప్ కేసుపై సీబీఐ దర్యాప్తు ప్రారంభించింది. ప్రస్తుతం తమిళనాడులో ఉంటున్న ఆమెను ప్రాసిక్యూషన్ సాక్షిగా సీబీఐ పేర్కొంది. ఈ కేసు విచారణ కోసం ప్రత్యేక కోర్టుకు హాజరుకావాలని తొలిసారి పిలిచింది. దీంతో ఢిల్లీలోని సీబీఐ ప్రత్యేక కోర్టులో హాజరైన రుబైయా సయీద్, నాడు తనను కిడ్నాప్ చేసిన జేకేఎల్ఎఫ్ చీఫ్ యాసిన్ మాలిక్తో సహా మరో ముగ్గురిని గుర్తించింది. న్యాయవాది అనిల్ సేథీ ఈ విషయాన్ని మీడియాకు శుక్రవారం వెల్లడించారు.
మరోవైపు రుబైయా సయీద్ కిడ్నాప్ కేసులో యాసిన్ మాలిక్, అలీ మహ్మద్ మీర్, మహ్మద్ జమాన్ మీర్, ఇక్బాల్ అహ్మద్ గాండ్రూ, జావేద్ అహ్మద్ మీర్, మహ్మద్ రఫీక్ పహ్లూ, మంజూర్ అహ్మద్ సోఫీ, వజాహత్ బషీర్, మెహ్రాజ్-ఉద్-దిన్ షేక్, షోకత్ అహ్మద్ బక్షీలపై సీబీఐ అభియోగాలు మోపింది. అయితే అలీ మహ్మద్ మీర్, జమాన్ మీర్, ఇక్బాల్ గాండ్రూ ఈ కిడ్నాప్లో తమతోపాటు మాలిక్ ప్రమేయాన్ని అంగీకరించారు.
అయితే రుబైయా కిడ్నాప్ కేసులో సాక్షులను తాను క్రాస్ క్వెశ్చన్ చేయాలనుకుంటున్నట్లు యాసిన్ మాలిక్ సీబీఐ కోర్టుకు తెలిపాడు. దీని కోసం కోర్టుకు తనను భౌతికంగా హాజరుకావడానికి, సాక్షులను క్రాస్ ఎగ్జామిన్ చేయడానికి అనుమతించకపోతే నిరాహార దీక్ష చేస్తానని బెదిరించాడు.
కాగా, 2017 టెర్రర్ ఫండింగ్ కేసుకు సంబంధించి యాసిన్ మాలిక్ను ఎన్ఐఏ కోర్టు ఈ ఏడాది మేలో దోషిగా నిర్ధారించి జీవిత ఖైదు విధించింది. కశ్మీర్ నుంచి పండిట్ల వలసలకు యాసిన్ మాలిక్ కారణమని ఎన్ఐఏ ఆరోపించింది. మరోవైపు 1990 జనవరిలో శ్రీనగర్ శివార్లలో నలుగురు ఐఏఎఫ్ సిబ్బందిని కాల్చి చంపిన కేసును కూడా యాసిన్ మాలిక్ ఎదుర్కొంటున్నాడు.