న్యూఢిల్లీ : జమ్ము కశ్మీర్ ఓ ప్రయోగశాలగా తయారైందని, ప్రభుత్వం ఏమైనా చేయదలిస్తే ముందుగా కశ్మీర్ను ఎంచుకుంటోందని పీడీపీ చీఫ్, జమ్ము కశ్మీర్ మాజీ సీఎం మెహబూబూ ముఫ్తీ ఆరోపించారు. కశ్మీర్లో ఏ ఒక్కరినీ స్వేచ్ఛగా మాట్లాడేందుకు అనుమతించడం లేదని మోదీ సర్కార్పై మండిపడ్డారు. కశ్మీర్లో దయనీయ పరిస్ధితులు నెలకొన్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఆర్టికల్ 370 రద్దు తర్వాత జమ్ము కశ్మీర్లో పరిస్ధితి మరింత దిగజారిందని అన్నారు.
కశ్మీర్ పరిస్ధితులపై కేంద్రం అసత్యాలు ప్రచారం చేస్తోందని మెహబూబా ముఫ్తీ మండిపడ్డారు. ఆర్టికల్ 370 రద్దుపై మెహబూబా ముఫ్తీ గతంలోనూ పలుమార్లు కేంద్రం తీరును తప్పుపట్టారు. కేంద్రం దేశాన్ని గాడ్సేల భారత్, గాడ్సేల కశ్మీర్గా మార్చివేస్తోందని ఇటీవల ఆమె దుయ్యబట్టారు. స్దానిక యువతకు ఉపాధి అవకాశాలు అందుబాటులో లేవని, గొంతెత్తిన వారిని అణిచివేతకు గురిచేస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. భద్రతా సిబ్బంది భుజాలపై తుపాకీ గురిపెట్టి కశ్మీరీలను కాల్చే కుట్ర జరుగుతోందని వ్యాఖ్యానించారు.