నేషనల్ డెస్క్: కత్తితో కసితీరా పొడవడం, తినే అన్నంలో విషం కలపడం, ముక్కలుగా నరికి డ్రమ్ములో పడేసి సిమెంట్తో పూత పూయడం.. ఏంటీ హాలీవుడ్ ‘సా’ మూవీ సిరీస్ గురించి చెప్తున్నాం అనుకొంటున్నారా? ఇటీవలి కాలంలో జరిగిన కొన్ని కేసుల్లో జరిగిన క్రైమ్ రకాలు ఇవి. అక్రమ సంబంధానికి అలవాటుపడిన కొందరు.. కట్టుకొన్న భాగస్వామిని కడతేరుస్తున్న ఘటనలు ఈ మధ్య అంతకంతకూ పెరిగిపోతున్నాయి. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన రాజా రఘువంశీ-సోనమ్ ‘బ్లడీ హనీమూన్’ ఉదంతం.. వైవాహిక బంధాలు, అక్రమ సంబంధాలపై మరోసారి చర్చను తీసుకొస్తున్నది.
బెంగళూరులో టెకీగా పనిచేస్తున్న హరిణి అనే 33 ఏండ్ల వివాహితను ఓ వ్యక్తి 13 సార్లు పొడిచి పొడిచి చంపాడు. అతనెవరో కాదు.. బాధితురాలితో కొన్నేండ్లుగా వివాహితేర సంబంధం కొనసాగించిన వ్యక్తే. అక్రమ సంబంధాన్ని ఇక ముగించివేద్దామని ఆమె చెప్పడంతో.. కోపోద్రిక్తుడైన అతడు బాధితురాలిని ఇంత దారుణంగా హత్య చేశాడు.
లండన్లో పనిచేస్తున్న 24 ఏండ్ల సౌరభ్ రాజ్పుత్ తన భార్య ముస్కాన్ రస్తోగీని చూసేందుకు ఈ ఏడాది మొదట్లో మీరట్కు వచ్చాడు. అయితే, తన వివాహేతర సంబంధం ఎక్కడ బయటపడిపోతుందోనని భయపడిన ముస్కాన్.. సౌరభ్ తినే అన్నంలో విషం పెట్టి చంపేసింది. తన ప్రియుడు సాహిల్ శుక్లాతో కలసి సౌరభ్ మృతదేహాన్ని ముక్కలుగా నరికి ఓ ప్లాస్టిక్ డ్రమ్ములో పడేసింది. అనంతరం దానిపై సిమెంటు పోసి మూసేసింది.
హర్యానాకు చెందిన యూట్యూబర్ రవీనా రావు తన వివాహేతర సంబంధం తెలిసిపోయినందుకు తన భర్త ప్రవీణ్ని ఆమె గొంతు నులిమి చంపేసింది. ఆ తర్వాత ఆ మృతదేహాన్ని ఓ కాలువలో పడేసింది. సీసీటీవీలో ఆమె కదలికలు అనుమానాస్పదంగా కనిపించడంతో పోలీసులు ఆమెను అరెస్టు చేశారు.
కర్ణాటకలో బ్యూటీ పార్లర్ నడుపుతున్న ప్రతిమ అనే వివాహిత.. తన భర్తను చంపేందుకు తన ప్రియుడు దిలీప్తో కలసి కుట్ర పన్నింది. భర్త బాలకృష్ణకు విషం పెట్టి.. అతను స్పృహ కోల్పోగానే ఊపిరాడనీయకుండా చేసి చంపేసింది. ప్రమాదవశాత్తు జరిగిన మరణంగా చిత్రీకరించేందుకు ప్రయత్నించిన ప్రతిమ, ఆమె ప్రియుడు అరెస్టయ్యారు.
పెండ్లయ్యి రెండు వారాలు గడువక ముందే యూపీలో ప్రగతి అనే వివాహిత తన భర్త దిలీప్ను కాంట్రాక్ట్ కిల్లర్కు సుపారీ ఇచ్చి కాల్చి చంపించింది. అనురాగ్ అనే బాయ్ఫ్రెండ్ కోసమే ఇదంతా చేసింది. కాగా.. పెండ్లికి వచ్చిన నగదు బహుమతిని కిల్లర్కు ఆమె ఫీజుగా ఇచ్చింది.
భర్త, ఇద్దరు పిల్లలు, అత్తమామలకు విషంపెట్టి చంపేందుకు ప్రయత్నించిన ఓ 33 ఏండ్ల మహిళను కర్ణాటకలోని హసన్ జిల్లా పోలీసులు అరెస్టు చేశారు. హసన్ నివాసి గజేంద్రతో 11 ఏండ్ల క్రితం పైండ్లెన చైత్రకు మరో వ్యక్తితో వివాహేతర సంబంధం ఏర్పడింది. దీంతో తన ప్రియుడు శివూతో కలసి ఆమె తన కుటుంబ సభ్యులకు భోజనంలో నిద్రమాత్రలు కలిపింది. తమపై హత్యా యత్నాన్ని గుర్తించిన ఆమె భర్త.. పోలీసులకు ఫిర్యాదు చేయడంతో చైత్రను, ఆమె ప్రియుడిని అరెస్టు చేశారు.