Chiranjeevi on Venkaiah Naidu | మెగాస్టార్ చిరంజీవి కీలక వ్యాఖ్యలు చేశారు. భారత ఉపరాష్ట్రపతిగా ఉన్న వెంకయ్యనాయుడు రాష్ట్రపతి అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నట్లు ఆయన చెప్పారు. ‘అయ్యప్ప స్వామి సాక్షిగా వెంకయ్యనాయుడు భారత రాష్ట్రపతి కావాలి. ఉపరాష్ట్రపతిగా ఆయన దేశానికి చాలా సేవ చేశారు’ అని చిరంజీవి అన్నారు.
వెంకయ్యనాయుడు రాష్ట్రపతి కావాలని తెలుగు ప్రజలందరూ కోరుకుంటున్నారని చిరంజీవి తెలిపారు. హైదరాబాద్లోని లాల్బంగ్లాలో యోధ లైఫ్లైన్ డయాగ్నోస్టిక్స్ సెంటర్ ప్రారంభోత్సవం సందర్భంగా మెగాస్టార్ మాట్లాడారు. ఈ కార్యక్రమానికి ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, తెలంగాణ ఆర్ధిక మంత్రి హరీష్రావు, తలసాని, చిరంజీవి ముఖ్యఅతిథులుగా హాజరయ్యారు.
ప్రస్తుత రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ పదవీకాలం వచ్చే ఏడాది జూలై నాటికి పూర్తవుతుంది. ఆయన 2017లో భారత ప్రథమ పౌరుడిగా బాధ్యతలు స్వీకరించిన సంగతి తెలిసిందే. వెంకయ్య నాయుడు భారత ఉపరాష్ట్రపతిగా బాధ్యతలు చేపట్టారు. ప్రస్తుతం ఆయన ఇదే పదవిలో కొనసాగుతున్నారు.
వచ్చే ఏడాది భారత రాష్ట్రపతిగా రామ్నాథ్ కోవింద్ పదవీకాలం ముగియనున్న తరుణంలో వెంకయ్యనాయుడు రాష్ట్రపతి కావాలని మెగాస్టార్ చిరంజీవి కోరుకోవడం గమనార్హం.