Padma Awards | న్యూఢిల్లీ, జనవరి 25: ప్రముఖ సినీనటుడు చిరంజీవి, మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడిని పద్మవిభూషణ్ పురస్కారం వరించింది. గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని కేంద్ర ప్రభుత్వం గురువారం పద్మ పురస్కారాలను ప్రకటించింది. ఈ ఏడాది మొత్తం 132 మందికి పద్మ అవార్డులను ప్రకటించగా.. అందులో ఐదుగురికి పద్మవిభూషణ్, 17 మందికి పద్మభూషణ్, 110 మందికి పద్మశ్రీ అవార్డులు దక్కాయి. అలనాటి నటి వైజయంతి మాల బాలి, సులభ్ ఇంటర్నేషనల్ వ్యవస్థాపకుడు బిందేశ్వర్ పాఠక్, పద్మ సుబ్రమణ్యంలను పద్మవిభూషణ్కు కేంద్రం ఎంపిక చేసింది.
సుప్రీంకోర్టు తొలి మహిళా న్యాయమూర్తి ఫాతిమా బీవీ, నటులు మిథున్ చక్రవర్తి, విజయకాంత్ తదితరులను పద్మభూషణ్ వరించింది. తెలంగాణకు చెందిన ఐదుగురు పద్మ అవార్డులకు ఎంపికయ్యారు. మొత్తంగా అవార్డులు దక్కినవారిలో 30 మంది మహిళలు, 8 మంది విదేశీయులు ఉన్నారు. మరణానంతరం 9 మందికి అవార్డులను ప్రకటించారు. దేశ అత్యున్నత పౌర పురస్కారమైన భారతరత్నను బీహార్ మాజీ సీఎం, జననాయక్ కర్పూరి ఠాకూర్ (మరణానంతరం)కు ఇటీవల కేంద్రం ప్రకటించిన విషయం తెలిసిందే.
పద్మవిభూషణ్
1.వైజయంతీమాల బాలి (కళలు, తమిళనాడు)
2.కొణిదెల చిరంజీవి (కళలు, ఏపీ)
3.ఎం.వెంకయ్యనాయుడు (ప్రజా సంబంధాలు, ఏపీ)
4.బిందేశ్వర్ పాఠక్ (మరణానంతరం)-(సామాజికసేవ, బీహార్)
5.పద్మ సుబ్రహ్మణ్యం (కళలు, తమిళనాడు)
పద్మభూషణ్
1.ఎం.ఫాతిమా బీవీ (మరణానంతరం), రాష్ట్రం-కేరళ 2.హర్మస్జీ ఎన్ కామా, మహారాష్ట్ర 3.మిథున్ చక్రవర్తి, పశ్చిమ బెంగాల్ 4.సీతారాం జిందాల్, కర్ణాటక 5.యోంగ్ లు, తైవాన్ 6.అశ్విన్ బాలాచంద్ మెహతా, మహారాష్ట్ర 7.సత్యబ్రత ముఖర్జీ, పశ్చిమ బెంగాల్ 8.రామ్ నాయక్, మహారాష్ట్ర 9.తేజస్ మధుసూదన్ పటేల్, గుజరాత్ 10.ఒలిచెరి రాజగోపాల్, కేరళ 11.దత్రాత్రేయ అంబదాస్ మాయూలూ అలియాస్ రాజ్దత్, మహారాష్ట్ర 12.తోగ్డాన్ రింపోచ్, లడఖ్ 13.చంద్రేశ్వర్ ప్రసాద్ ఠాకూర్, బీహార్ 14.ఉషా ఉతప్, పశ్చిమ బెంగాల్ 15. విజయ్కాంత్ (మరణానంతరం), తమిళనాడు 16.కుందన్ వ్యాస్, మహారాష్ట్ర 17.ప్యారేలాల్ శర్మ
పద్మశ్రీకి ఎంపికైన వారిలో కొందరు…
మొగల్తూరు నుంచి పద్మవిభూషణ్ దాకా
అగ్ర నటుడు చిరంజీవి కీర్తి కిరీటంలో మరో కలికితురాయి చేరింది. భారత ప్రభుత్వం అందించే రెండో అత్యున్నత పురస్కారం పద్మవిభూషణ్కు ఎంపికయ్యారు. అక్కినేని నాగేశ్వరావు, ప్రముఖ గాయకుడు బాలసుబ్రహ్మణ్యం తర్వాత ఈ పురస్కారాన్ని అందుకున్న మూడో వ్యక్తిగా చిరంజీవి చరిత్రకెక్కారు. 1978లో వచ్చిన ‘పునాదిరాళ్లు’తో చిరంజీవి తన నట జీవితాన్ని ప్రారంభించారు.
ఆయనకు 2006లో పద్మభూషణ్ అవార్డు దక్కింది. సుదీర్ఘ సినీ ప్రస్థానంలో కమర్షియల్ సినిమాకు కొత్త భాష్యం చెప్తూ సంచలన విజయాలతో ఎన్నో అవార్డులు సొంతం చేసుకున్నారు మెగాస్టార్. ఎన్టీఆర్ తర్వాత అంతటి మాస్ ఇమేజ్ సాధించుకున్న వ్యక్తి చిరంజీవి. సినిమాల్లో ఆల్ రౌండర్గా ఎదగడమే కాక ఓ ట్రెండ్ సెట్ చేశారాయన. అప్పటివరకున్న మూస ధోరణికి స్వస్తి పలికి సినిమాలకు కమర్షియల్ హంగులు అద్దారు.
47 సినిమాలు 100 రోజులు ఆడాయంటే ప్రేక్షక హృదయాల్లో ఆయన స్థానం ఎంత గొప్పదో చెప్పక్కర్లేదు. ప్రస్తుతం దర్శకుడు వశిష్టతో కలిసి చేస్తున్న ‘విశ్వంభర’ చిరంజీవికి 156వ సినిమా. 2006లో ఆంధ్ర యూనివర్సిటీ గౌరవ డాక్టరేట్ ఇచ్చింది. ఇంకా ఆయన ఖాతాలో రఘుపతి వెంకయ్య పురస్కారం (2016)తోపాటు 3 నందులు, 9 ఫిల్మ్ఫేర్ అవార్డులున్నాయి. ప్రజారాజ్యం పార్టీ స్థాపించి కాంగ్రెస్లో విలీనం చేశారు. కేంద్ర మంత్రిగా సేవలందించారు. చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్ స్థాపించి బ్లడ్, ఐ బ్యాంక్ల ద్వారా సామాజిక సేవతో మానవత్వం చాటారు.
వెంకయ్యనాయుడు
1949 జూలై 1న ఆంధ్రప్రదేశ్లోని నెల్లూరు జిల్లా చవటపాలెంలో జన్మించారు. 1972లో ఉద్ధృతంగా సాగిన జైఆంధ్ర ఉద్యమంతో వెలుగులోకి వచ్చారు. ఆయన నెల్లూరులో జరిగిన ఆందోళనలో చురుగ్గా పాల్గొన్నారు. 1999లో గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రిగా, 2014లో మోదీ మంత్రివర్గంలో కేంద్ర మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. 2017 నుంచి 2022 వరకు భారత 13వ ఉప రాష్ట్రపతిగా పనిచేశారు. నెల్లూరులో ‘స్వర్ణ భారత్ ట్రస్ట్’ను స్థాపించి అనేక సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.
వైజయంతిమాల
1933, ఆగస్టు 13న చెన్నైలోని తమిళ కుటుంబంలో జన్మించారు. నాట్య కళాకారిణిగా, సినీ నటిగా ఎన్నో అవార్డులు అందుకున్నారు. హిందీ దేవదాస్లో హీరోయిన్గా న టించారు. 1980లో ఎంపీగా ఎన్నికయ్యారు.
బిందేశ్వర్ పాఠక్
బీహార్లోని వైశాలిలో 1943 ఏప్రిల్ 2న జన్మించారు. సులభ్ ఇంటర్నేషనల్ వ్యవస్థాపకుడు. మరుగుదొడ్ల నిర్మాణంపై ఐదు దశాబ్దాలపాటు ఉద్యమించారు. పారిశుద్ధ్య కార్మికుల పట్ల వివక్షకు వ్యతిరేకంగా పోరాడారు. గత ఏడాది ఆగస్టు 15న కన్నుమూశారు.