జైపూర్: సుమారు 150 దూడల జన్మకు కారణమైన అరుదైన, శ్రేష్ఠమైన దున్నను దాని యజమాని ఏకంగా రూ.11 కోట్లకు అమ్మకానికి పెట్టాడు. 1,570 కిలోల బరువున్న దున్న అన్మోల్(Buffalo Anmol) రాజస్థాన్లోని అజ్మీర్లో జరుగుతున్న అంతర్జాతీయ పశు మేళాలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. హర్యానాలోని సిర్సాకు చెందిన హర్విందర్ సింగ్కు చెందిన ఈ దున్నను కుమారుడి మాదిరిగా పెంచాడు. ఎనిమిదేళ్ల వయస్సు, 5.8 అడుగుల పొడవున్న ఈ దున్నకు అన్మోల్ అని పేరు పెట్టాడు. దీనికి ఇప్పటికే సోషల్ మీడియాలో ఎంతో ప్రచారం లభించింది.
కాగా, యజమాని హర్విందర్ సింగ్, ఈ దున్నకు ప్రతి రోజు అరటి పండ్లు, గుడ్లు వంటి బలమైన ఆహారం తినిపిస్తాడు. గత ఏడాది 1400 కిలోల బరువున్న ఈ దున్న ప్రస్తుతం 1,570 కిలోల బరువుకు చేరింది. దీని వీర్యం వల్ల ఇప్పటి వరకు 40-50 కిలోల బరువున్న ఆరోగ్యవంతమైన 150 దూడలు జన్మించాయని యజమాని తెలిపాడు. దీని ఆహారం కోసం ప్రతి నెలా సుమారు మూడు లక్షలు ఖర్చు చేస్తున్నట్లు చెప్పాడు.
మరోవైపు రాజస్థాన్లోని అజ్మీర్లో ప్రస్తుతం జరుగుతున్న అంతర్జాతీయ పుష్కర్ మేళాకు ఈ దున్నను హర్విందర్ సింగ్ తీసుకొచ్చాడు. అరుదైన, బలిష్ఠమైన దున్నను రూ.11 కోట్లకు అమ్ముతానని తెలిపాడు. గత ఏడాది మూడు కోట్లకు కొనేందుకు ఒక వ్యక్తి ఆసక్తి చూపినప్పటికీ, అంత తక్కువకు అమ్మేందుకు అతడు నిరాకరించాడు. తన దున్న చాలా విలువైందని చెబుతున్న యజమాని సింగ్, రూ.11 కోట్లకు కొనే వ్యక్తి కోసం ఎదురుచూస్తున్నట్లు మీడియాతో అన్నాడు.