న్యూఢిల్లీ, ఫిబ్రవరి 17: ఢిల్లీ మేయర్ ఎన్నికపై సుప్రీంకోర్టు కీలక తీర్పు వెలువరించింది. ఈ ఎన్నికలో నామినేటెడ్ సభ్యులు ఓటు వేయలేరని స్పష్టం చేసింది. శుక్రవారం ఈ కేసుపై విచారణ చేపట్టిన చీఫ్ జస్టిస్ డీవై చంద్రచూడ్, జస్టిస్ పీఎస్ నరసింహ, జస్టిస్ జేబీ పార్ధివాలా ధర్మాసనం.. లెఫ్ట్నెంట్ గవర్నర్ నామినేట్ చేసిన సభ్యులు మేయర్ ఎన్నికలో ఓటు వేసేందుకు నిరాకరించింది. ఎన్నిక కోసం 24 గంటల్లోగా తొలి ఎంసీడీ సమావేశం నిర్వహించాలని ఆదేశించింది. ‘నామినేటెడ్ సభ్యుల అధికారాలపై రాజ్యాంగం పరిమితి విధించింది. వారికి ఓటు హక్కు లేదు’ అని తేల్చి చెప్పింది. సుప్రీం కోర్టు తీర్పుతో ఆప్కి ఉపశమనం లభించింది.
జరిగిందిదీ..
గత డిసెంబర్లో జరిగిన ఢిల్లీ మున్సిపల్ ఎన్నికల్లో 250 స్థానాలకు గానూ, ఆప్ 134 సీట్లు గెలుచుకొని, మేయర్ పీఠం దక్కించుకొనేందుకు అర్హత సాధించింది. 104 స్థానాలు గెలుచుకొన్న బీజేపీ రెండో స్థానానికి పరిమితమైంది. కాంగ్రెస్కు 9 సీట్లు దక్కాయి. ఆప్ తరఫున మేయర్ అభ్యర్థిగా షెల్లీ ఒబెరాయ్, బీజేపీ తరఫున రేఖా గుప్తా పోటీ పడుతున్నారు. అయితే, మేయర్ ఎన్నికలో నామినేటెడ్ సభ్యులకు ఓటు హక్కు కల్పిస్తూ ఎల్జీ నిర్ణయం తీసుకోవటం వివాదానికి కారణమైంది. మేయర్, డిప్యూటీ మేయర్, స్టాండింగ్ కమిటీలో ఆరుగురు సభ్యులను ఎన్నుకొనేందుకు మూడు సార్లు సమావేశమైనా ఎన్నికల ప్రక్రియ చేపట్టకుండానే వాయిదా పడ్డాయి. ఎల్జీ నిర్ణయాన్ని ఆప్ వ్యతిరేకిస్తూ వస్తున్నది. దీనిపై సుప్రీం కోర్టులో సవాలు చేసింది. ఈ నేపథ్యంలో నామినేటెడ్ సభ్యులకు ఓటు హక్కును నిరాకరిస్తూ సుప్రీం కీలక తీర్పు వెలువరించింది.
ప్రజాస్వామ్యం గెలిచింది
సుప్రీం కోర్టు తీర్పు ప్రజాస్వామ్య విజయం. దేశ అత్యున్నత న్యాయస్థానానికి ప్రత్యేక కృతజ్ఞతలు. లెఫ్ట్నెంట్ గవర్నర్, బీజేపీ చట్టవిరుద్ధ, రాజ్యాంగ వ్యతిరేక ఆదేశాలు ఇస్తున్నట్టు తేటతెల్లమైంది. రెండున్నర నెలల తర్వాత ఢిల్లీకి మేయర్ రాబోతున్నారు.
– ఆప్ కన్వీనర్, ఢిల్లీ సీఎం కేజ్రీవాల్