న్యూఢిల్లీ: దేశంలోనే అతిపెద్ద పాల ఉత్పత్తి సంస్థ అయిన అమూల్ డెయిరీ (గుజరాత్) లీటర్ పాల ధర రూ.3 చొప్పున పెంచడంపై కాంగ్రెస్ పార్టీ తీవ్ర విమర్శలు చేసింది. ఏటా రెండుమూడు సార్లు పాల ధరలు పెంచుతూ పోతే భారం పడేది దేశంలోని సామాన్య ప్రజలపైనేగానీ, సంపన్నులపై కాదని కాంగ్రెస్ ఎంపీ అధిర్ రంజన్ చౌదరి విమర్శించారు.
ప్రధాని నరేంద్రమోదీ, హోంమంత్రి అమిత్ షా పాలు తాగకపోవచ్చని, కానీ.. దేశంలోని పసిబిడ్డలందరికీ పాలు తప్పనిసరిగా ఇవ్వాల్సి ఉంటుందని అధిర్ రంజన్ గుర్తుచేశారు. మాటిమాటికి పాల ధరలు పెరుగుతుండటంతో తమ బిడ్డల ఆకలి తీర్చడానికి సామాన్యులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని వ్యాఖ్యానించారు. పాల ధరల పెంపు ద్వారా కేంద్రం మరోసారి తన బుద్ధిని నిరూపించుకుందని ఆయన మండిపడ్డారు.
అమూల్ డెయిరీ శుక్రవారం లీటర్కు రూ.3 చొప్పున పాల ధరలు పెంచేసింది. దాంతో అమూల్ గోల్డ్ పాల ధర లీటర్ రూ.66కు, అమూల్ తాజా పాల ధర లీటర్ రూ.54కు, అమూల్ ఆవు పాల ధర లీటర్ రూ.56కు పెరిగింది. అమూల్ ఏ2 గేదె పాల ధర లీటర్ రూ.70కి చేరింది. పెరిగిన పాల ధరలు ఇవాళ్టి నుంచే అమల్లోకి వచ్చాయని అమూల్ డెయిరీ ప్రకటించింది.