లక్నో : ఎన్డీఏతో పాటు విపక్ష కూటమి ఇండియా రెండూ పేదల వ్యతిరేక, కులతత్వ కూటములేనని బీఎస్పీ అధినేత్రి మాయావతి (Mayawati) ఆరోపించారు. తమ పార్టీ ఏ కూటమిలో చేరబోదని, 2024 సార్వత్రిక ఎన్నికల్లో స్వతంత్రంగా పోటీ చేస్తుందని స్పష్టం చేశారు. బీఎస్పీ 2007 మాదిరిగా రానున్న సార్వత్రిక ఎన్నికలతో పాటు నాలుగు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో సొంతంగా పోటీ చేస్తుందని పేర్కొన్నారు. అణగారిన, నిర్లక్ష్యానికి గురైన వర్గాలకు ప్రాతినిధ్యం వహిస్తూ ప్రజల్లో సోదరభావం పెంపొందించేందుకు కృషి చేస్తుందని చెప్పారు.
తమ పార్టీ విపక్ష ఇండియా కూటమిలో చేరుతుందనే ప్రచారాన్ని ఆమె ట్విట్టర్ వేదికగా తోసిపుచ్చారు. ఇలాంటి అసత్యాలను ప్రచారం చేయరాదని మాయావతి మీడియాను కోరారు. ఇండియా, ఎన్డీఏ కూటముల్లో పలు పార్టీలు పేదల వ్యతిరేక, కులతత్వ పోకడలతో పెట్టుబడిదారీ అనుకూల విధానాలు అనుసరిస్తున్నాయని ఆమె మండిపడ్డారు. ఇలాంటి శక్తులకు వ్యతిరేకంగా బీఎస్పీ పోరాటం కొనసాగుతుందని అన్నారు. అలాంటి పార్టీల కలయికతో ముందుకొచ్చిన ఇండియా, ఎన్డీఏ కూటములతో తమ పార్టీ కలిసి ముందుకు సాగదని స్పష్టం చేశారు.
విపక్ష ఇండియా కూటమి కేవలం తమ కూటమిలో చేరిన పార్టీలనే లౌకిక పార్టీలుగా పరిగణించడం శోచనీయమని ఆమె ఎద్దేవా చేశారు. ఇక త్వరలో జరిగే నాలుగు ప్రధాన రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో గణనీయంగా సీట్లు, ఓట్లు సాధించాలని బీఎస్పీ పావులు కదుపుతోంది. 2018 రాజస్ధాన్ అసెంబ్లీ ఎన్నికల్లో బీఎస్పీ 8 స్ధానాల్లో గెలుపొందింది. 2013లో ఆ పార్టీ 3.37 శాతం ఓట్లు సాధించగా, 2018లో 4 శాతం ఓట్లు సాధించింది. ఇక మధ్యప్రదేశ్లో 2018 అసెంబ్లీ ఎన్నికల్లో బీఎస్పీ 5 శాతం ఓట్లతో రెండు స్ధానాలను గెలుచుకుంది. చత్తీస్ఘఢ్ అసెంబ్లీ ఎన్నికల్లో 3.87 శాతం ఓట్లు సాధించిన బీఎస్పీ రెండు సీట్లలో విజయం సాధించింది.
Read More :
Rahul Gandhi: చైనా మ్యాప్లో అరుణాచల్, లడాఖ్.. ప్రధాని మౌనం వీడాలన్న రాహుల్ గాంధీ