Mayawati | దాదాపు 147 రోజుల తర్వాత బీఎస్పీ అధినేత్రి మాయావతి బహిరంగ సభలో ప్రసంగించారు. ఆగ్రాలో జరిగిన ర్యాలీలో మాయావతి పాల్గొన్నారు. ఈ సందర్భంగా సమాజ్వాదీ, బీజేపీ, కాంగ్రెస్పై తీవ్రంగా విరుచుకుపడ్డారు. బీజేపీ హయాంలో కేవలం దళితులను మాత్రమే అణగదొక్కారని, దళితుల స్థితి ఏమాత్రం బాగోలేదని ఆరోపించారు. ఇక సమాజ్వాదీ హయాంలో గూండాలే రాజ్యమేలారని, గూండాలు సామాన్యుల జీవితాన్ని దుర్భరం చేశారని తీవ్రంగా మండిపడ్డారు. సమాజ్వాదీ హయాంలో అఖిలేశ్ యాదవ్ కేవలం కొన్ని వర్గాలను తృప్తి పరచడానికే ప్రయత్నాలు చేశారని మాయావతి ఆరోపించారు. ఇక బెహన్జీ కాంగ్రెస్ పై కూడా అంతే రీతిలో విరుచుకుపడ్డారు. కాంగ్రెస్ అనుసరించిన విధి విధానాలే ఆ పార్టీని నిండా ముంచేశాయని నర్మగర్భ వ్యాఖ్యలు చేశారు. యూపీలో సర్కారు ఏర్పాటే లక్ష్యంగా ముందుకు సాగుతున్నామని, యూపీ ప్రజలందరూ బీఎస్పీకే ఓటు వేయాలని, ఇతర పార్టీలకు ఓటు వేయవద్దని మాయావతి మరోసారి విజ్ఞప్తి చేశారు.
ఎన్నికలు దగ్గరపడుతున్నా… తాను కనిపించడం లేదని మీడియాతో సహా కొందరు విమర్శలు చేశారని మాయావతి ఈ సందర్భంగా గుర్తు చేశారు. ఇన్ని రోజులు తాను ఎక్కడికీ వెళ్లలేదని, పార్టీని బలోపేతం చేసే చర్యల్లో బిజీ బిజీగా గడిపానని మాయావతి వెల్లడించారు. తక్కువ మాట్లాడటం, ఎక్కువగా పనిచేయడం ఈ సూత్రాన్నే తమ పార్టీ బలంగా విశ్వసిస్తుందని మాయావతి పేర్కొన్నారు.