ఇప్పుడే పెంపు ఎందుకు?
పెట్రోపెంపుపై పార్లమెంట్లో పురి ఇచ్చిన వివరణపై సోషల్మీడియాలో నెటిజన్లు పెద్దయెత్తున మండిపడుతున్నారు. ఎన్నికల్లో లబ్ధి పొందడానికే కేంద్రం కావాలనే పెట్రో రేట్లను ఇంతకాలం స్థిరంగా కొనసాగించిందని, ఎన్నికలు ముగియగానే మళ్లీ బాదుడు మొదలుపెట్టిందని విమర్శిస్తున్నారు. కేంద్రమంత్రి ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని ధ్వజమెత్తుతున్నారు.
నెటిజన్లు చేసిన పోస్టుల్లో కొన్ని..
అంతర్జాతీయంగా చమురు ధరలు పెరిగాయి గనుకనే పెట్రో ధరలను పెంచుతున్నామన్నారు. అయితే. గడిచిన ఐదు నెలల్లో పెట్రో ధరలను ఎందుకు పెంచలేదు? ఎన్నికల్లో లబ్ధి కోసమే కేంద్రం పెట్రో ధరలను నియంత్రించింది
-తుషార్
ఎన్నికల సమయంలో అంటే గడిచిన 137 రోజుల్లో అంతర్జాతీయంగా చమురు ధరలు ఏమీ పెరుగలేదా? ఇప్పుడే ఉన్నట్లుండి పెరిగాయా??
-సందీప్ కన్వార్
భారత్లో ఐదు రాష్ర్టాల అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్నాయని తెలిసి నవంబర్ 2021 నుంచి మార్చి 22 వరకు అంతర్జాతీయ మార్కెట్లను మూసేశారు కాబోలు.
-వేద్ నాయక్
సీఎన్జీపై రూపాయి వడ్డింపు
పెట్రోల్, డీజిల్, ఎల్పీజీ తర్వాత.. సీఎన్జీ, పైపుల ద్వారా సరఫరా చేసే వంటగ్యాస్ (పీఎన్జీ)పై కేజీకి ఒక్క రూపాయి చొప్పున వడ్డిస్తూ చమురు కంపెనీలు గురువారం నిర్ణయం తీసుకొన్నాయి. దేశ రాజధాని ఢిల్లీ పరిధిలో ఈ రేట్లు అమల్లోకి వచ్చినట్టు పేర్కొన్నాయి. తాజా పెంపుతో రూ. 58.01గా ఉన్న కేజీ సీఎన్జీ రూ. 59.01కి చేరినట్టు ఇంద్రప్రస్త గ్యాస్ లిమిటెడ్ పేర్కొంది.