లక్నో: ఉత్తరప్రదేశ్లో సామూహిక పెళ్లిళ్ల మోసం బయటపడింది. (Massive Wedding Fraud ) డబ్బులు తీసుకున్న కొందరు వ్యక్తులు వధూవరులుగా నటించారు. పెళ్లికుమారులు తగినంత మంది లేకపోవడంతో ఏకంగా పెళ్లికుమార్తెలే వారి మెడలో పూలదండలు వేసుకున్నారు. ఈ స్కామ్కు సంబంధించి ఇద్దరు ప్రభుత్వ అధికారులతో సహా 15 మందిని అరెస్ట్ చేశారు. జనవరి 25న బలియా జిల్లాలో ఒక సంఘం ఆధ్వర్యంలో సామూహిక వివాహాలు జరిగాయి. ఈ కార్యక్రమంలో సుమారు 568 జంటలు పెళ్లి చేసుకున్నారు.
కాగా, సామూహిక వివాహాల్లో పాల్గొన్న వధూవరులకు రూ.2,000 నుంచి రూ.500 వరకు డబ్బులు చెల్లించి అలా నటింపజేసినట్లు ఆరోపణలు వచ్చాయి. కొందరు మహిళలకు పురుషులు లేకపోవడంతో వారే స్వయంగా వరమాల ధరించారు. ఈ కమ్యూనిటీ వివాహానికి బీజేపీ ఎమ్మెల్యే కేత్కీ సింగ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. నకిలీ వధూవరులను ఆయన ఆశీర్వదించారు.
మరోవైపు కమ్యూనిటీ సామూహిక వివాహ పథకం కోసం ప్రతి జంటకు యూపీ ప్రభుత్వం రూ.51,000 ఇస్తుంది. ఇందులో రూ.35,000 వధువుకు, రూ.10,000 పెళ్లి వస్తువుల కొనుగోలుకు, రూ.6,000 వేడుక కోసం ఖర్చు చేయాల్సి ఉంటుంది. అయితే కేవలం ఈ పథకం డబ్బు కోసం ఉత్తుత్తి పెళ్లిళ్ల మోసానికి పాల్పడినట్లు దర్యాప్తులో తేలింది.
కాగా, ఈ నకిలీ పెళ్లిళ్లకు సంబంధించిన వీడియో క్లిప్స్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. దీంతో అధికారులు చర్యలు చేపట్టారు. ఇద్దరు ప్రభుత్వ ఉద్యోగులతో సహా 15 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే వివాహ లబ్ధిదారులు ఎవరకీ ఈ పథకం డబ్బును ఇంకా బదిలీ చేయలేదని అధికారులు వివరణ ఇచ్చారు.
Watch | Massive Wedding Fraud Unearthed In UP: Brides Seen Garlanding Selves@tanishqq9 reports pic.twitter.com/zn1bArXEPx
— NDTV (@ndtv) February 4, 2024