ముంబై: మహారాష్ట్రలోని భివండీలో (Bhiwandi) భారీ అగ్నిప్రమాదం జరిగింది. ఆదివారం రాత్రి భివండిలోని కాజీ కాంపౌండ్లో ఉన్న వస్త్ర పరిశ్రమలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. క్రమంగా అవి ఫ్యాక్టరీ అంతటా వ్యాపించడంతో భారీగా అగ్ని కీలలు ఎగసిపడ్డాయి. చుట్టు పక్కల ప్రాంతాల్లో పొగ దట్టంగా అలముకున్నది.
సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకున్నారు. కొన్ని గంటల పాటు శ్రమించి మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. కాగా, ప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదని అధికారులు వెల్లడించారు. ఈ ప్రమాదం వల్ల కోట్ల విలువైన దుస్తులు, సామగ్రి దగ్ధమయ్యాయని తెలిపారు. అగ్నిప్రమాదంలో ఇప్పటివరకు ఎవరూ గాయపడలేదని పేర్కొన్నారు. ఈ ఘటనపై కేసు నమోదుచేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.