‘రెగ్యులర్ కమర్షియల్ సినిమాల్లో కనిపించే పాటలు, కామెడీ ట్రాక్లు ఇందులో ఉండవు. ఇలాంటి కథను హీరో నాగార్జున ఒప్పుకుంటారా? అని భయపడ్డాం. కథలోని కొత్తదనం నచ్చి ఆయన ‘వైల్డ్డాగ్’ను అంగీకరించారు’ అని అన్నారు అహిషోర్ సాల్మన్. ఆయన దర్శకత్వం వహించిన తాజా చిత్రం ‘వైల్డ్డాగ్’. నాగార్జున కథానాయకుడిగా నటించిన ఈ చిత్రం ఏప్రిల్ 2న ప్రేక్షకుల ముందుకురానున్నది. ఈ సందర్భంగా బుధవారం హైదరాబాద్లో అహిషోర్ సాల్మన్ పాత్రికేయులతో ముచ్చటించారు. ఆ విశేషాలివి..
2007 హైదరాబాద్ బాంబు దాడుల ఘటన ఆధారంగా రూపొందిన చిత్రమిది. ఆనాటి బాంబు దాడుల్లో చాలా మంది చనిపోయారు. ఈ సంఘటన ఐదారేళ్ల పాటు ప్రజల్లో భయాందోళనల్ని కలిగించింది. అలాంటి పరిస్థితుల్లో ఈ బాంబు బ్లాస్ట్ కేసును కేంద్రం ఎన్ఐఏ బృందానికి అప్పగించింది. వారి పరిశోధనలో బాంబు దాడులకు పాల్పడిన ప్రధాన సూత్రధారి విదేశాల్లో దాక్కున్నాడని తేలింది. ఎన్ఐఏ బృందం అండర్కవర్ ఆపరేషన్ ద్వారా ఆ నేరస్తుడిని ఎలా పట్టుకుందనే వార్త కథనాల స్ఫూర్తితో సినిమాను తెరకెక్కించాం. దేశంమీద ఉన్న ప్రేమతో ప్రాణాలకు తెగించి ఎన్ఐఏ బృందం చేసిన పోరాటానికి ఫిక్షనల్ అంశాలను జోడించి రూపొందించాం. ఈ పోరాట యోధుల గురించి తెలుగు ప్రేక్షకులతో పాటు దేశం మొత్తానికి చెప్పాలనే ఆలోచనతో చేసిన ప్రయత్నమిది. ఎన్ఐఏ అధికారులను కలిసి సేకరించిన సమాచారంతో పాటు కొన్ని పుస్తకాలు, పత్రికల్లో వచ్చిన కథనాల ఆధారంగా ఈ స్టోరీ రాసుకున్నా.
హాలీవుడ్ ఫైట్మాస్టర్స్..
ఈ సినిమాలో నాగార్జునతో పాటు ప్రతి పాత్రకు సమప్రాధాన్యత ఉంటుంది. . ప్రయోగాత్మక సినిమా కాదిది. యాక్షన్ ప్రధానంగా ఆద్యంతం ఉత్కంఠభరితంగా ఉంటుంది. తమన్ నేపథ్యసంగీతం ప్రధానాకర్షణగా నిలుస్తుంది. నేపాల్ బ్యాక్డ్రాప్లో ఈ కథ సాగుతుంది. ‘ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్’తో పాటు మరికొన్ని హాలీవుడ్ సినిమాలకు యాక్షన్ కొరియోగ్రఫీ అందించిన డేవిడ్ ఎస్మలోన్తో పాటు బాలీవుడ్ ఫైట్మాస్టర్ శ్యామ్ కౌషల్ తెరకెక్కించిన పోరాట ఘట్టాలు రొమాంచితంగా సాగుతాయి. లాక్డౌన్ తర్వాత ప్రేక్షకులు సినిమాల్ని చూసే ధోరణి మారింది. కొత్త తరహా కథాంశాల్ని ఇష్టపడుతున్నారు. వైవిధ్యతను కోరుకునే వారందరిని ఈ సినిమా మెప్పిస్తుంది.
‘మహర్షి’ ఆనందాన్నిచ్చింది..
లాక్డౌన్ తర్వాత థియేటర్లు పునఃప్రారంభమవుతాయా?ప్రేక్షకులు సినిమాలు చూడటానికి వస్తారా అనే అనుమానాలతో ఉన్న సమయంలో ఓటీటీ సంస్థ మంచి ఆఫర్తో మమ్మల్ని సంప్రదించింది. నిర్మాతకు లాభదాయకం కావడంతో ఓటీటీలో సినిమాను విడుదలచేయడానికి నేను అంగీకరించా. కానీ ‘క్రాక్ ’ విజయం థియేటర్లలోనే సినిమాను విడుదలచేసే ధైర్యాన్ని ఇచ్చింది. బిగ్స్క్రీన్ ఎక్స్పీరియన్స్ను ప్రేక్షకులకు అందివ్వాలనే మా నిర్ణయాన్ని మార్చుకున్నాం. నేను రచయితగా పనిచేసిన ‘మహరి’్ష సినిమాకు జాతీయ అవార్డు రావడం ఆనందంగా ఉంది. ఈ సినిమాకు నేను, వంశీపైడిపల్లి, హరి కలిసి కథను అందించాం. సందేశానికి మహేష్బాబు ఇమేజ్ను బ్యాలెన్స్ చేస్తూ ఛాలెంజింగ్గా ఈ సినిమా చేశాం. మా కష్టానికి తగ్గ ప్రతిఫలంరావడం సంతోషాన్నిచ్చింది.