Masood Azhar | న్యూఢిల్లీ, జనవరి 1: భారత్కు మోస్ట్వాంటెడ్ ఉగ్రవాదిగా ఉన్న జైషే మహ్మద్ ఉగ్రవాద సంస్థ చీఫ్ మసూద్ అజహర్ హతమయ్యాడని సోషల్ మీడియాలో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. పాకిస్థాన్లోని పంజాబ్ రాష్ట్రంలో గల భవల్పూర్ మసీదుకు వెళ్లి తిరిగి వస్తుండగా గుర్తుతెలియని వ్యక్తులు ఆయనపై బాంబు దాడికి పాల్పడినట్టు ఆ కథనాలు పేర్కొన్నాయి. ఈ ఘటనలో మసూద్ అజహర్ అక్కడికక్కడే మరణించాడనే వార్తలు వచ్చాయి. అయితే ఈ వార్తలపై పాక్ అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయలేదు. పాక్ మీడియాలోనూ దీనిపై వార్తలు రాలేదు. కాగా, మసూద్ అజహర్ను ఐక్యరాజ్యసమితి అంతర్జాతీయ ఉగ్రవాదిగా ఇదివరకే ప్రకటించింది. మసూద్ పాక్లోనే ఉంటున్నాడనే వాదనలు ఉన్నాయి. అయితే దీన్ని పాకిస్థాన్ అంగీకరించడం లేదు. ఈ నేపథ్యంలో ఒకవేళ మసూద్ మరణించినా.. దానిపై పాక్ నుంచి అధికారిక ప్రకటన వచ్చే అవకాశం లేదు. పాకిస్థాన్లో గత కొన్ని నెలలుగా గుర్తుతెలియని వ్యక్తుల చేతుల్లో ఉగ్రవాదులు హతమవుతున్న ఘటనలు చోటుచేసుకొంటున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో తాజాగా వైరల్ అవుతున్న మసూద్ మృతి వార్తకు ప్రాధాన్యం సంతరించుకొన్నది.
పాక్ కేంద్రంగా పనిచేసే జైషే మహ్మద్ అగ్రనేతగా మసూద్ ఉన్నాడు. భారత్లో పలు ఉగ్రదాడుల వెనక మసూద్ హస్తమున్నది. 1995లో భారత్ అతడిని అరెస్ట్ చేసింది. అయితే 1999లో కాందహార్ విమాన హైజాక్ ఘటనతో భారత్ అతడిని విడుదల చేయాల్సి వచ్చింది. అనంతరం అతడు జైషే ఉగ్రవాద సంస్థను స్థాపించాడు. 2001లో పార్లమెంట్పై దాడి, 2008లో ముంబై పేలుళ్లు, 2019లో పుల్వామా ఉగ్రదాడులకు మసూద్ ప్రధాన సూత్రధారిగా ఉన్నారు.