Uttar Pradesh : ఉత్తర ప్రదేశ్లోని ఆగ్రాలో దారుణం జరిగింది. పెళ్లైన యువకుడు, మరో యువతి ఒకే ఇంట్లో అనుమానాస్పదంగా మరణించారు. అది కూడా ఒకే ఉరితాడుకు వేలాడుతూ. ఈ ఘటన యూపీలోని ఎట్మాడ్పూర్ పోలీస్ స్టేషన్ పరిధి, రహాన్కల్లా గ్రామంలో తాజాగా వెలుగు చూసింది. దీనిపై పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఈ ఘటనలో మరణించిన యువకుడి వయసు 22 కాగా, యువతి వయసు 19.
రక్షా బంధన్ రోజు యువతి కుటుంబం బంధువుల ఊరుకు వెళ్లింది. దీంతో ఇంట్లో యువతి ఒంటరిగా ఉంది. ఆ యువతి ఇంటికి పెళ్లైన వ్యక్తి వెళ్లాడు. తర్వాత కుటుంబ సభ్యులు వచ్చి చూసేసరికి, ఇంట్లో ఇద్దరూ ఒకే ఉరితాడుకు వేలాడుతూ కనిపించారు. దీనిపై వారు పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలం నుంచి పోలీసులు ఆధారాలు సేకరించారు. మృతదేహాల్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. యువకుడికి కొంతకాలం క్రితమే పెళ్లి అయింది. యువతికి వివాహం నిశ్చయం కాగా.. త్వరలోనే పెళ్లి జరగాల్సి ఉంది.
పోలీసుల ప్రాథమిక అంచనా ప్రకారం.. ఇద్దరూ ప్రేమలో ఉన్నట్లు అనుమానిస్తున్నారు. ఈ ప్రేమ వ్యవహారమే ఇద్దరి మరణానికి కారణమని భావిస్తున్నారు. ఈ ఘటనను ఆత్మహత్యగానే అనుమానిస్తున్నారు. అతడికి ఇప్పటికే పెళ్లి కావడం.. యువతికి పెళ్లి నిశ్చయమైన నేపథ్యంలో.. కలిసి బతికే అవకాశం లేదని ఇద్దరూ ఆత్మహత్య చేసుకుని ఉండొచ్చని అంచనా. ఈ కోణంలో పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు. ఇదే సమయంలో ఇతర కోణాల్లోనూ విచారణ జరుపుతున్నామని పోలీసులు తెలిపారు.
బాధితుల కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు చెప్పారు. ఇదే సమయంలో కుటుంబ సభ్యుల్ని కూడా విచారిస్తున్నట్లు తెలిపారు. అన్ని అంశాలపై పూర్తిస్థాయిలో విచారణ జరుపుతామని పోలీసులు స్పష్టం చేశారు.