Air India CEO | ఢిల్లీ: ఇమ్మిగ్రేషన్ (Immigration) ప్రక్రియను పూర్తి చేయకుండానే ముగ్గురు ఇటాలియన్లను ఢిల్లీలోని అంతర్జాతీయ విమానాశ్రయంలో విమానం ఎక్కడానికి అనుమతించారనే ఆరోపణలపై ఎయిరిండియా సీఈవోకు మినిస్ట్రీ ఆఫ్ సివిల్ ఏవియేషన్ షోకాజ్ నోటీస్ జారీ చేసింది. ముగ్గురు ప్రయాణికులు అమృత్సర్ నుంచి ఢిల్లీకి సెప్టెంబర్ 4న వచ్చారు. వారు ఎలాంటి ఇమ్మిగ్రేషన్ క్లియరెన్స్ లేకుండానే ఢిల్లీ నుంచి మ్యూనిచ్కు వెళ్లే లుఫ్తాన్సా ఫ్లైట్ ఎక్కారు. విషయం తెలిసి దీనిపై చర్చించేందుకు హోం శాఖ కార్యదర్శి గోవింద్ మోహన్ నేతృత్వంలో సీనియర్ అధికారులు, స్టేక్హోల్డర్లతో మంగళవారం సమావేశం నిర్వహించారు.
ఆ ముగ్గురు ప్రయాణికులకు ఢిల్లీకి వెళ్లే ఎయిరిండియా విమానం, మ్యూనిచ్కు వెళ్లే లుఫ్తాన్సా విమానం రెండింటికి అమృత్సర్లో బోర్డింగ్ పాస్ జారీ చేశారు. ఎయిరిండియా ప్రవేశపెట్టిన ‘హబ్ అండ్ స్పోక్ (Hub-and-Spoke)’ విధానంలో అమృత్సర్ విమానాశ్రయం ఒకటి. దీని ప్రకారం విమానం బయలుదేరే విమానాశ్రయంలోనే ఇమ్మిగ్రేషన్ ప్రక్రియను పూర్తి చేసుకుని ఎలాంటి ఇబ్బందులు లేకుండా విదేశాలకు ప్రయాణించవచ్చు. ఇంటర్నేషనల్ విమానం వెళ్లే విమానాశ్రయంలో కేవలం భద్రతా తనిఖీని పూర్తి చేసుకుని విమానం ఎక్కుతారు. ఇక్కడ అమృత్సర్ స్పోక్గా, ఢిల్లీ హబ్గా ఉంటుంది.
ఈ ముగ్గురి ఇటాలియన్ ప్రయాణికుల విషయంలో ఢిల్లీ విమానంతో పాటు మ్యూనిచ్ వెళ్లే లుఫ్తాన్సా విమానం కోసం అమృత్సర్లోనే బోర్డింగ్ పాస్లు జారీ అయ్యాయి. అయితే ఆ రెండు విమానాలు హబ్ అండ్ స్పోక్ విధానంలోకి రావు. కాబట్టి వారు లుఫ్తాన్సా విమానం ఎక్కే ముందు ఇమ్మిగ్రేషన్ ప్రక్రియను పూర్తి చేసుకోవాలి.
విమానయాన సంస్థలో భద్రత, నిబంధనలు పాటించడం, జవాబుదారీతనం వంటి వాటిపై ఎయిరిండియా చైర్మన్ ఎన్ చంద్రశేఖరన్ (Chandrasekharan) ఓ సమావేశంలో చెప్పారు. ఇలా ఆయన చెప్పిన కొద్దిరోజులకే ఈ ఘటన జరగడంతో చర్చనీయాంశంగా మారింది.