బెంగళూరు, సెప్టెంబర్ 17: కర్ణాటకలోని ఓ మారుమూల పల్లెకు ఉన్న గుంతల రోడ్డు ఆ ఊరోళ్ల పెండ్లిళ్లకు అడ్డుగా మారుతున్నది. దేవంగిర్ జిల్లా హెచ్ రాంపుర గ్రామానికి సరైన రోడ్డు లేదని, దీని కారణంగానే ఊరిలో చాలామందికి పెండ్లిళ్లు కావడం కష్టంగా మారిందని బిందు అనే యువ టీచర్ నేరుగా కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజు బొమ్మైకి లేఖ రాసింది. రోడ్డు బాగు చేయాలని విజ్ఞప్తి చేసింది. ‘ఇప్పటికీ మా ఊరు వెనుకబడే ఉన్నది. సరైన రోడ్డు సౌకర్యం లేదు. ఈ కారణంగా ఇక్కడ పిల్లలకు చదువుకునే అవకాశాలు తక్కువగా ఉన్నాయని బయటివాళ్లు ఆలోచిస్తున్నారు. అందుకే మా ఊరిలో చాలా మందికి పెండ్లి చేసుకొనే అవకాశాలు దొరకడంలేదు’ అని ముఖ్యమంత్రికి రాసిన లేఖలో పేర్కొన్నది. దీనిపై స్పందించిన సీఎంవో వెంటనే సమస్య తీర్చేందుకు చర్యలు చేపడుతామని హామీ ఇచ్చింది.