న్యూఢిల్లీ : నరేంద్ర మోదీ సారధ్యంలోని కాషాయ సర్కార్పై విపక్షాల ఉపరాష్ట్రపతి అభ్యర్ధి మార్గరెట్ అల్వా విరుచుకుపడ్డారు. రాజకీయ నేతల ఫోన్లను బిగ్ బ్రదర్ ట్యాపింగ్ చేస్తారని, నేతల్లో నెలకొన్న ఈ భయం ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తోందని ఆందోళన వ్యక్తం చేశారు. ఫోన్ ట్యాపింగ్ భయంతో పార్టీలకు అతీతంగా ఎంపీలు, ఆయా పార్టీల నేతలు తరచూ ఫోన్ నెంబర్లు మార్చేస్తున్నారని ఆమె ట్వీట్ చేశారు. తన ఫోన్ కాల్స్ను డైవర్ట్ చేస్తున్నారని బీఎస్ఎన్ఎల్ను ట్యాగ్ చేస్తూ మరో ట్వీట్ చేశారు.
బీజేపీలోని కొందరు స్నేహితులతో ఈరోజు మాట్లాడిన అనంతరం తన ఫోన్కు వచ్చే కాల్స్ను డైవర్ట్ చేస్తున్నారని, తాను కాల్స్ చేయలేకపోతున్నానని, రిసీవ్ చేసుకోలేకపోతున్నానని తెలిపారు. అల్వా ట్వీట్ నేపధ్యంలో ఈ వ్యవహారంపై బీఎస్ఎన్ఎల్ ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. అల్వా ఫిర్యాదుపై తగిన చర్యలు చేపట్టామని, ఈ వ్యవహారంపై ఎఫ్ఐఆర్ను బీఎస్ఎన్ఎల్ దాఖలు చేసిందని టెలికాం మంత్రిత్వ శాఖ వర్గాలు తెలిపాయి.
ఇక అల్వా ఆరోపణలపై కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషీ స్పందిస్తూ ఆమె ఫోన్ను ఎందుకు ట్యాప్ చేస్తారని, ఇవి అపరిపక్వతతో కూడిన ఆరోపణలని తోసిపుచ్చారు. ఉప రాష్ట్రపతి ఎన్నికల ఫలితాలపై తాము విశ్వాసంతో ఉన్నామని, ఫోన్ ట్యాపింగ్ చేయాల్సిన అవసరం తమకు లేదని అన్నారు. సీనియర్ నేత అయిన అల్వా ఇలాంటి చౌకబారు ఆరోపణలు చేయడం తగదని వ్యాఖ్యానించారు.