వరంగల్ : సీపీఐ (మావోయిస్ట్) నేత, ఆ పార్టీ పొలిట్బ్యూరో మాజీ సభ్యుడు కోబాద్ గాంధీని మావోయిస్టు పార్టీ బహిష్కరించింది. మార్క్సిజం సిద్ధాంతాలు, వర్గ పోరాట పంధాను వీడి బూర్జువా సిద్ధాంతాలకు మద్దతు ఇస్తున్నందున ఈ నిర్ణయం తీసుకున్నట్టు మావోయిస్టు పార్టీ జాతీయ ప్రతినిధి అభయ్ ఓ ప్రకటనలో పేర్కొన్నారు. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్న కోబాద్ గాంధీని మావోయిస్ట్ పార్టీ నుంచి కేంద్ర కమిటీ బహిష్కరించిందని తెలిపారు.
2019లో జైలు నుంచి విడుదలైన తర్వాత గాంధీ పార్టీ సిద్ధాంతాలకు వ్యతిరేకంగా ఫ్రాక్చర్డ్ ఫ్రీడం-ఏ ప్రిన్ మెమొయిర్ అనే పేరుతో పుస్తకం రాసి ప్రచురించారని చెప్పారు. ఆయన పుస్తకానికి పార్టీ త్వరలో బదులిస్తుందని అన్నారు. మార్క్సిజం-లెనినిజం-మావోయిజంతో గాంధీ పూర్తిగా వేరుపడ్డారని పార్టీ అర్ధం చేసుకున్నదని అన్నారు. ఈ మూడు అంశాలు తన 40 ఏండ్ల విప్లవజీవితంలో ఎలాంటి మార్పును తీసుకురాలేదని కూడా ఆయన చెప్పుకొచ్చారని పేర్కొన్నారు. బూర్జువా నైతిక కధల సారాన్ని గ్రహించాలని గాంధీ అన్నారని అభయ్ ప్రస్తావించారు.
మార్క్సిస్ట్ పద్ధతులు, జీవన విధానంలో ఎలాంటి సంతోషం లేదని, అందుకే మార్క్సిజం తన లక్ష్యాన్ని చేరుకోవడంలో విఫలమైందని గాంధీ అభాండాలు వేశారని అన్నారు. మార్క్సిజం-లెనినిజం-మావోయిజంపై గాంధీ తప్పుడు వివరణలు, వ్యాఖ్యానాలు చేశారని పేర్కొన్నారు. గాంధీ 40 ఏండ్లకు పైగా నక్సల్బరీ రాజకీయాలను అనుసరిస్తూ సీపీఐ(ఎంఎల్), పీపుల్స్ వార్ గ్రూప్ కేంద్ర కమిటీ సభ్యుడిగా పనిచేశారు. మహారాష్ట్ర రాష్ట్ర కమిటీ సభ్యుడిగానూ వ్యవహరించిన గాంధీ 2019లో అరెస్టయ్యే వరకూ సీపీఐ(మావోయిస్టు) పొలిట్ బ్యూరో సభ్యుడిగా కొనసాగారు.