కుమ్రం భీం ఆసిఫాబాద్, డిసెంబర్ 16 (నమస్తే తెలంగాణ): దేశవ్యాప్తంగా మావోయిస్టుల కోసం వేట కొనసాగుతూనే ఉంది. తెలంగాణలోని కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్-యు అటవీ ప్రాంతంలో సోమవారం రాత్రి కూంబింగ్ నిర్వహించిన పోలీసులు 16 మంది మావోయిస్టులను అరెస్ట్ చేశారు. పోలీసు నిఘా విభాగం సమాచారంతో ఏఎస్పీ చిత్తరంజన్ ఆధ్వర్యంలో ప్రత్యేక పోలీసు బలగాలతో సిర్పూర్-యు అటవీ ప్రాంతంలో కూంబింగ్ నిర్వహించగా 16 మంది మావోయిస్టులు పట్టుబడినట్లు ఆయన తెలిపారు.
పట్టుబడిన వారిలో 9 మంది మహిళా మావోయిస్టులు ఉండగా, ఏడుగురు పురుషులు ఉన్నారని చెప్పారు. అరెస్టయిన వారిలో రాష్ట్ర స్థాయి కేడర్ కలిగిన బడె చొక్కారావు అలియాస్ దామోదర్ ఉన్నట్లు సమాచారం. జిల్లాలో మావోయిస్టు సంచారం పూర్తిగా తగ్గిపోయిందని భావిస్తున్న సమయంలో 16 మంది పట్టుబడటం పోలీసు వర్గాల్లో కలకలం రేపింది.
తాడ్వాయి: 30 ఏండ్ల కిందట అజ్ఞాతంలోకి వెళ్లిన తన కొడుకు పోలీసులకు పట్టుబడ్డాడని తెలియడంతో తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి చొక్కారావు అలియాస్ దామోదర్ తల్లి సంతోషపడటంతోపాటు తన కొడుకును తనకు అప్పగించాలని పోలీసులను వేడుకుంటున్నది. మంగళవారం మీడియాతో ఆమె మాట్లాడుతూ.. తన కొడుకును ప్రాణాలతో చూస్తానో లేదోననే బాధ ఉండేదని, పోలీసులకు దొరికాడనే వార్త ఎంతో సంతోషాన్ని ఇచ్చిందని చెప్పారు.
హైదరాబాద్: తెలంగాణ పోలీసు అదుపులో ఉన్న మావోయిస్టులను వెంటనే కోర్టులో ప్రవేశపెట్టాలని తెలంగాణ పౌరహక్కుల సంఘం రాష్ట్ర కమిటీ డిమాండ్ చేసింది. పోలీసులు అదుపులో ఉన్న వారిని వెంటనే కోర్టులో హాజరుపరచాలని, వారికి ఎలాంటి ప్రాణహాని తలపెట్టవదని తెలంగాణ పౌర హకుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ప్రొఫెసర్ గడ్డం లక్ష్మణ్, ప్రధాన కార్యదర్శి ఎన్.నారాయణరావు డిమాండ్ చేశారు.