రాయ్పూర్: ప్రేమించుకున్న మావోయిస్ట్ జంట, పెళ్లి చేసుకుని హాయిగా బతకాలని భావించింది. అయితే మావోయిస్ట్ క్యాంప్ నుంచి పారిపోయిన ఈ జంటను సహచరులు దారుణంగా హత్య చేశారు. వారిద్దరిని వెంటాడి పట్టుకుని కాల్చి చంపారు. ఛత్తీస్గఢ్లోని బీజాపూర్ జిల్లాలో ఈ ఘటన జరిగింది. ఈ నెల 6న గంగలూరు ప్రాంతంలో ముగ్గురు వ్యక్తులను మావోయిస్టులు హత్య చేసినట్లు పోలీసులకు సమాచారం అందింది. సంఘటనా స్థలానికి వెళ్లి పరిశీలించగా మృతుల్లో ఇద్దరు మావోయిస్టులు కమ్లు, మంగి ఉన్నట్లుగా పోలీసులు గుర్తించారు.
గంగలూరు ఏరియా కమిటీ మిలీషియా ప్లాటూన్ కమాండర్ కమ్లు పునెం, మిలీషియా సభ్యురాలు మంగి గత కొంతకాలంగా సన్నిహితంగా ఉంటున్నారని, ఈ క్రమంలో వారి మధ్య ప్రేమ పుట్టిందని బస్తర్ రేంజ్ ఐజీ పీ సుందర్రాజ్ తెలిపారు. పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్న వారిద్దరూ మావోయిస్ట్ శిబిరం నుంచి పారిపోయారని చెప్పారు. ఈ విషయం తెలిసిన సహచర మావోయిస్టులు ఆ జంట ఎక్కడ ఉన్నదో గుర్తించిందని, వారిని వెంబడించి పట్టుకున్నారని తెలిపారు. అనంతరం ఇందీనార్ గ్రామంలో ప్రజా కోర్టు నిర్వహించి మరణశిక్ష విధించారని, ఈ మేరకు కమ్లు, మంగిని తుపాకులతో కాల్చి చంపారని వెల్లడించారు. మావోయిస్టులు హత్య చేసిన మూడో వ్యక్తి గురించి తమ వద్ద ఎలాంటి సమాచారం లేదన్నారు.
మరోవైపు బీజాపూర్ జిల్లాలోని పలు పోలీస్ స్టేషన్లలో నమోదైన11 క్రిమినల్ కేసుల్లో కమ్లు వాంటెడ్గా ఉండగా, మంగిపై మూడు కేసులు ఉన్నట్లు బస్తర్ రేంజ్ ఐజీ పీ సుందర్రాజ్ తెలిపారు. గంగలూరు ఏరియా కమిటీలో కమ్లు, మంగి క్రియాశీల సభ్యులని చెప్పారు. అయితే ఏరియా కమాండర్తో సహా తమ సొంత సహచరులను కూడా ఈ కమిటీ హత్య చేసిందన్నారు. ఈ మధ్య కాలంలో మావోయిస్టులు వరుస పరాజయాలను చవి చూశారని ఆయన తెలిపారు. దీంతో దిక్కుతోచని స్థితిలో ఉండి నిరాశకు గురయ్యారని, కేవలం అనుమానంతో తమ సహచరులను కూడా చంపుతున్నారని అన్నారు.