న్యూఢిల్లీ: ఫోన్ల హ్యాకింగ్ వ్యవహారంపై దుమారం కొనసాగుతున్నది. ‘ప్రభుత్వ ప్రాయోజిత వ్యక్తులు మీ ఫోన్ హ్యాకింగ్కు ప్రయత్నిస్తున్నారు’ అంటూ పలువురు ప్రతిపక్ష ఎంపీలు, నేతల ఐఫోన్లకు యాపిల్ నుంచి హ్యాకింగ్ అలర్ట్ సందేశాలు వచ్చిన విషయం తెలిసిందే. నిఘా ఆరోపణల వ్యవహారంపై కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంపై విపక్షాలు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తుతున్నాయి. హ్యాకింగ్ అలర్ట్ అంశంపై చర్చించేందుకు ఐటీ శాఖ పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీని వెంటనే సమావేశపరచాలని డిమాండ్ చేస్తున్నాయి. ఈ మేరకు కాంగ్రెస్ ఎంపీ కార్తి చిదంబరం, సీపీఎం ఎంపీ జాన్ బ్రిట్టాస్ కమిటీ చైర్పర్సన్ ప్రతాపరావ్ జాదవ్కు లేఖ రాశారు. యాపిల్ నుంచి ఈ సందేశాలను వచ్చిన వారిని, యాపిల్ సంస్థ ప్రతినిధులను సమావేశానికి పిలువాలని చిదంబంరం తన లేఖలో కోరారు.ప్రభుత్వం అక్రమంగా పెట్టిన ఈ నిఘా ప్రాథమిక హక్కులపై దాడిగా టీఎంసీ ఎంపీ మహువా మొయిత్రా అభివర్ణించారు.
విపక్ష నేతలనందరినీ జైళ్లకు పంపే కుట్ర
వచ్చే ఏడాది జరిగే లోక్సభ ఎన్నికలకు ముందే దేశంలోని విపక్ష నేతలనందరినీ అరెస్ట్ చేసి జైళ్లకు పంపడానికి కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కుట్ర పన్నుతున్నది. తద్వారా ఖాళీ అయిన దేశంలో తమకు తామే ఓట్లు వేసుకునేలా మోదీ ప్రభుత్వం ప్రణాళిక రచిస్తున్నది. అలాగే విపక్ష ఎంపీల ఫోన్లను కేంద్రం హ్యాక్ చేస్తున్నది.
-బెంగాల్ సీఎం మమతా బెనర్జీ
ఐదు రాష్ర్టాల ఎన్నికల్లో బీజేపీ ఓటమి ఖాయం
కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎవరైనా మాట్లాడితే వెంటనే ఈడీ, సీబీఐ, ఐటీ దాడులు జరుగుతున్నాయి. విపక్షాలను బెదిరించడానికే కేంద్రం ఈ దాడులు చేయిస్తున్నది. ఇక ఇప్పుడు విపక్ష నేతల ఫోన్లు హ్యాకింగ్కు గురైనట్లు మెసేజ్లు వస్తున్నాయి. బీజేపీకి ఓటమి భయం పట్టుకున్నది. ఐదు రాష్ర్టాల ఎన్నికల్లో బీజేపీ ఓడిపోవడం ఖాయం. అందుకే ఇలా ప్రవర్తిస్తున్నది.
-తమిళనాడు సీఎం స్టాలిన్