చెన్నై: తమిళనాడును భార్షీ వర్షాలు (heavy rains) వణికిస్తున్నాయి. శనివారం సాయంత్రం నుంచి చెన్నై, దాని చుట్టు పక్కల ప్రాంతాల్లో వాన కుండపోతగా కురిసింది. దీంతో చెన్నైలోని వందలాది కాలనీలు నీటమునిగాయి. నగరంలోని కొరటూర్, పెరంబూర్, అన్నా సలై, టీ నగర్, గిండి, అడ్యార్, పెరుంగుడి ప్రాంతాలు జలదిగ్భందంలో చిక్కుకున్నాయి. కన్యాకుమారి, కాంచిపురం, ముధురైలో భారీ వర్షాలు కురిశాయి.
చెన్నైలో నిన్న రాత్రి నుంచి 20 సెంటీమీటర్ల వర్షపాతం నమోదయింది. దీంతో నగరంలోని చాలా ప్రాంతాల్లో అధికారులు విద్యుత్ సరఫరాను నిలిపివేశారు. లోకల్ రైళ్లను రైల్వే శాఖ రద్దుచేసింది. భారీ వర్షాలకు చంబారపాకం, పుయల్ రిజర్వాయర్లు నిండుకుండలా మారాయి. ఏ క్షణమైన డ్యాం గేట్లు ఎత్తే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. కాగా, రానున్న 24 గంటల్లో చెన్నై, దాని చుట్టుపక్క ప్రాంతాల్లో అతిభారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ (ఐఎండీ) హెచ్చరించింది.
భారీ వర్షాల నేపథ్యంలో సీఎం స్టాలిన్ అధికారులతో సమీక్ష నిర్వహించారు. సహయక చర్యలు ముమ్మరం చేయాలని ఆదేశించారు.