Mansukh Mandaviya | కరోనా కేసులు పెరిగిపోతున్న నేపథ్యంలో కేంద్ర వైద్య ఆరోగ్య మంత్రి మన్సుఖ్ మాండవీయ కొన్ని రాష్ట్రాల ఆరోగ్య మంత్రులతో సోమవారం సమీక్షా సమావేశం నిర్వహించారు. ముఖ్యంగా ఆక్సిజన్ సిలిండర్లపై దృష్టి నిలపాలని సూచించారు. అన్ని రకాల ఆక్సిజన్ ఇన్ఫాస్ట్రక్చర్లు రన్నింగ్ కండిషన్లో ఉండేవిధంగా చూసుకోవాలన్నారు. దేశంలో కరోనా కేసులు విపరీతంగా పెరుగుతున్నాయని, ఇలాంటి క్లిష్ట సమయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య ఎంతో సమన్వయం అవసరమని, అశ్రద్ధ వహించకూడదని కోరారు.
కోవిడ్పై అందరమూ పోరాడుతున్నామని, దీనిని ఎదుర్కొనే క్రమంలో సంసిద్ధత విషయంలో మాత్రం ఎలాంటి లోపాలుండరాదని సూచించారు. ముఖ్యమంగా జిల్లాల్లో వైద్య సదుపాయాలపై దృష్టినిలపాలని, ప్రతి జిల్లాలో కూడా టెలికన్సల్టేషన్ హబ్ను ఏర్పాటు చేసి, ఆరోగ్య సేవల విషయంలో విస్తృతంగా ప్రచారం చేయాలని మాండవీయ అన్నారు. ఈ సమావేశంలో గుజరాత్, రాజస్థాన్, మధ్యప్రదేశ్, గోవా, మహారాష్ట ఆరోగ్య మంత్రులతో పాటు దాద్రా నగర్ హవేలీ, డామన్ డయ్యూకి చెందిన ఆరోగ్య శాఖా మంత్రులు పాల్గొన్నారు.