న్యూఢిల్లీ: ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) చీఫ్, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్పై బీజేపీ మండిపడింది. మర్యాద లేని సీఎం అంటూ ట్విట్టర్లో విమర్శించింది. దీనికి సంబంధించి ఒక వీడియోను పోస్ట్ చేసింది. దేశంలో కరోనా కేసులు పెరుగుతుండటంతో ప్రధాని మోదీ అన్ని రాష్ట్రాల సీఎంలతో బుధవారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. పలు రాష్ట్రాల్లో కరోనా కేసులు, పరిస్థితిపై సమీక్షించారు. అనంతరం సీఎంలనుద్దేశించి ప్రధాని మోదీ మాట్లాడారు. అయితే లైవ్ వీడియో కాన్ఫరెన్స్లో పాల్గొన్న ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ సమావేశం మధ్యలో ఒకసారి కుర్చీలో వెనక్కి వాలి రెండు చేతులు తలవెనుక పెట్టుకున్నారు.
ఈ నేపథ్యంలో ప్రధాని మోదీ ప్రసంగాన్ని పట్టించుకోన్నట్లుగా, అగౌరవ పరిచేలా అరవింద్ కేజ్రీవాల్ వ్యవహారం ఉన్నదంటూ బీజేపీ మండిపడింది. ‘మేనర్లెస్ ఢిల్లీ సీఎం’ అని విమర్శించింది. ఈ మేరకు బీజేపీ అధికార ట్విట్టర్ ఖాతాలో దీనికి సంబంధించిన వీడియోను పోస్ట్ చేసింది. బీజేపీ షేర్ చేసిన 19 సెకన్ల వీడియో క్లిప్లో ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్, కర్ణాటక సీఎం బసవరాజ్ బొమ్మై, ఛత్తీస్గఢ్ సీఎం భూపేష్ బాఘేల్, ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్ మోహన్ రెడ్డి తదితరులు కూడా ఉన్నారు.
Mannerless CM of Delhi! pic.twitter.com/yswnLNI6Ty
— BJP Delhi (@BJP4Delhi) April 27, 2022