న్యూఢిల్లీ : ప్రధాని నరేంద్ర మోదీ బుధవారం చేపట్టిన కేంద్ర మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణపై కాంగ్రెస్ నేత మనీష్ తివారీ విమర్శలు గుప్పించారు. క్యాబినెట్ పునర్వ్యవస్థీకరణలో బీజేపీ, ఆరెస్సెస్ శ్రేణులను నిర్లక్ష్యం చేశారని, మాజీ బ్యూరోక్రాట్లను ప్రధాని మోదీ అతిగా నమ్ముకున్నారని వ్యాఖ్యానించారు. ఇక మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ సామర్ధ్యం ప్రాతిపదికన జరగలేదని, ఫిరాయింపుదార్లకు సర్ధుబాటు చేసేందుకు జరిగిన కసరత్తులా ఉందని కాంగ్రెస్ పేర్కొంది.
సామర్ధ్యం ఆధారంగా ఈ ప్రక్రియ జరిగిఉంటే పాలనలో విఫలమైన ప్రధాని మోదీని ముందుగా తొలగించాల్సి ఉందని కాంగ్రెస్ ముఖ్య అధికార ప్రతినిధి రణ్దీప్ సుర్జీవాలా వ్యాఖ్యానించారు. హోం, ఆర్థిక శాఖ మంత్రులు కూడా తమ బాధ్యతల నిర్వహణలో విఫలమయ్యారని వారిపై కూడా వేటు వేయాల్సి ఉందని ఆయన పేర్కొన్నారు.