న్యూ ఢిల్లీ: ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియా సీబీఐ ముందు హాజరుకానున్నారు. లిక్కర్ కేసులో సిసోడియాకు సీబీఐ సమన్లు జారీ చేసిన విషయం తెలిసిందే. సోమవారం ఉదయం 11 గంటలకు సీబీఐ ప్రధాన కార్యాలయంలో తమ ఎదుట హాజరుకావాలని ఆదేశించింది. ఈ నేపథ్యంలో కేంద్ర దర్యాప్తు సంస్థకు పూర్తిగా సహకరిస్తానన్న ఆయన.. సీబీఐ ప్రధాన కార్యాలయానికి బయలుదేరి వెళ్లారు. సీబీఐ కార్యాలయానికి వెళ్లే ముందు సిసోడియా.. తన తల్లి కాళ్లకు నమస్కరించి ఆశీస్సులు తీసుకున్నారు.
అంతకుముందు బీజేపీపై ట్విటర్ వేదికగా సిసోడియా తీవ్ర విమర్శలు చేశారు. తనను గుజరాత్ ఎన్నికల ప్రచారంలో పాల్గొనకుండా.. నకిలీ కేసులో అరెస్టు చేసేందుకు బీజేపీ ప్లాన్ చేసిందని విమర్శించారు. ‘‘రానున్న రోజుల్లో నేను గుజరాత్ ఎన్నికల ప్రచారానికి వెళ్లాల్సి ఉంది. నన్ను ఆపడమే వారి ఉద్దేశం. బీజేపీకి ఓటమి భయం పట్టుకుంది. బీజేపీ ప్లాన్లో భాగంగా నన్ను నకిలీ కేసులో అరెస్టు చేయనున్నారు. గతంలో నేను గుజరాత్ వెళ్లినప్పుడు ఢిల్లీ తరహా పాఠశాలను నిర్మిస్తానని అక్కడి ప్రజలకు మాట ఇచ్చాను. అది కొందరికి నచ్చడం లేదు. నన్ను జైలుకు పంపడంతో ఎన్నికలు ఆగవు. రానున్న రోజుల్లో ఆ ఎన్నికలు ఉద్యమంలా మారనున్నాయి’’ అంటూ సిసోడియా బీజేపీపై విమర్శలు చేశారు.
लेकिन मेरे जेल जाने से गुजरात का चुनाव प्रचार रुकेगा नहीं। आज हर गुजराती खड़ा हो गया है। अच्छे स्कूल, अस्पताल, नौकरी, बिजली के लिए गुजरात का बच्चा बच्चा अब चुनाव प्रचार कर रहा है। गुजरात का आने वाला चुनाव एक आंदोलन होगा।
— Manish Sisodia (@msisodia) October 17, 2022