ఇంఫాల్: మణిపూర్ మళ్లీ భగ్గుమంది. నూతన ఉప ముఖ్యమంత్రులుగా నెంచా కిప్జెన్, లోసీ డిఖో ప్రమాణం చేయడాన్ని వ్యతిరేకిస్తూ నిరసనలు చెలరేగిన తర్వాత గురువారం సాయంత్రం మణిపూర్లోని చురాచంద్పూర్ జిల్లాలో మళ్లీ హింసాకాండ ప్రజ్వరిల్లింది. తుయిబాంగ్ మెయిన్ మార్కెట్ ప్రాంతంలో వందలాది మంది యువజన నిరసనకారులు భద్రతా సిబ్బందిని వారి బ్యారెక్స్లోకి బలవంతంగా పంపేందుకు ప్రయత్నించారు. బలగాలు ప్రతిఘటించడంతో వారిపై నిరసనకారులు రాళ్లు రువ్వారు.
రోడ్లపై టైర్లకు నిప్పు పెట్టారు. చురాచంద్పూర్ జిల్లాలో కుకీల ప్రాబల్యం గల ప్రాంతాల్లో శుక్రవారం 6 నుంచి 12 గంటల బంద్కు ఏడు కుకీ సంఘాలతో కూడిన ఉమ్మడి వేదిక పిలుపునిచ్చింది. కాగా, నెంచా కిప్జెన్ను చంపితే రూ. 20 లక్షలు, ఎమ్మెల్యేలు ఎల్ఎం ఖౌతే, ఎన్ సేనాపతిని చంపితే రూ. 10 లక్షలు బహుమతి ఇస్తామని కొన్ని గ్రూపులు ప్రకటించాయి.
కొత్తగా ఏర్పడిన మణిపూర్ ప్రభుత్వంలో డిప్యూటీ సీఎంగా నెంచా కిప్జెన్ ప్రమాణం చేయడంపై కుకీ సమాజం రెండుగా చీలిపోయింది. ప్రభుత్వంలో చేరిన ముగ్గురు కుకీ ఎమ్మెల్యేలు తమ తెగకు ద్రోహం చేసి మైతీ తెగతో కుమ్మక్కయ్యారని ఆరోపిస్తూ ఆ ముగ్గురినీ సామాజిక బహిష్కరణ చేస్తున్నట్లు ఓ సంస్థ ప్రకటించింది. కుకీ-జో-మీ తెగకు చెందిన ముగ్గురు ఎమ్మెల్యేలు మణిపూర్ ప్రభుత్వంలో చేరారు.