ఇంఫాల్: తమ డిమాండ్లు, సమస్యలపై కేంద్ర ప్రభుత్వం స్పందించకపోవడం పట్ల మణిపూర్లోని గిరిజన సంఘం ఆగ్రహం వ్యక్తం చేసింది. లేని పక్షంలో ప్రత్యేక స్వీయ పరిపాలన ఏర్పాటు చేసుకుంటామని కేంద్రానికి అల్టిమేటమ్ ఇచ్చింది. (Separate Administration Demand) ఇండిజినస్ ట్రైబల్ లీడర్స్ ఫోరమ్ (ఐటీఎల్ఎఫ్) ఆధ్వర్యంలో బుధవారం చురచంద్పూర్లో భారీ నిరసన ప్రదర్శన జరిగింది. స్వయం పాలనకు సంబంధించిన తమ ప్రధాన డిమాండ్ను నెరవేర్చాలని గిరిజన సంఘాలు డిమాండ్ చేశాయి. అలాగే 22 మంది గిరిజనుల హత్యపై సీబీఐ లేదా ఎన్ఐఏ చేత దర్యాప్తు జరిపించాలని కోరాయి.
కాగా, ర్యాలీ సందర్భంగా ఐటీఎల్ఎఫ్ ప్రధాన కార్యదర్శి మువాన్ టోంబింగ్ మాట్లాడారు. మణిపూర్ ప్రభుత్వం నుంచి ప్రత్యేక పరిపాలన కావాలని గత ఆరు నెలలుగా డిమాండ్ చేస్తున్నప్పటికీ కేంద్ర ప్రభుత్వం ఏమీ చేయలేదని విమర్శించారు. ‘రెండు వారాల్లో మా గళం వినకపోతే, మా స్వపరిపాలనను మేమే ఏర్పాటు చేసుకుంటాం. కేంద్రం గుర్తించినా, గుర్తించకపోయినా ప్రత్యేక రాష్ట్రం లేదా కేంద్ర పాలిత ప్రాంతం కోసం ముందుకెళ్తాం. కుకీ-జో ప్రాంతాల్లోని అన్ని అంశాలను పరిశీలించే స్వయం ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాం. మా గొంతు వినడం లేదు కాబట్టి ఈ దిశగా ముందుకెళ్తాం’ అని పేర్కొన్నారు.
మరోవైపు మణిపూర్లోని లోయ ప్రాంతాల్లో ఆధిపత్యమున్న మైతీలకు ఎస్టీ హోదా ఇవ్వాలని ఆ రాష్ట్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం ప్రతిపాదించింది. అయితే కొండ ప్రాంతాల్లో ఆధిపత్యమున్న కుకీ గిరిజన తెగలు దీనిని వ్యతిరేకించాయి. ఈ నేపథ్యంలో ఈ ఏడాది మే నుంచి రెండు వర్గాల మధ్య జరిగిన అల్లర్లు, హింసాత్మక సంఘటనలతో మణిపూర్ అట్టుడికిపోయింది. సుమారు 200 మంది మరణించగా వేల సంఖ్యలో ప్రజలు నిరాశ్రులయ్యారు.